మహబూబాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ తొండి రాజకీయం చేస్తున్నదని బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన మున్సిపాలిటీలను కూడా దక్కకుండా చేసేందుకు కుట్రలు పన్నుతున్నదనే విమర్శలొస్తున్నాయి. వరంగల్ ఎంపీ కడియం కావ్య ఎక్స్అఫీషియో ఓట్లు రెండు చోట్ల నమోదు చేసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. గత సంవత్సరం జనవరి 29న వరంగల్ నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఎక్స్అఫీషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
కడియం కావ్య వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్అఫీషియో మెంబర్గా ఉండగానే, ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో మెంబర్గా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తొర్రూర్ 3వ వార్డు కౌన్సిలర్ తూర్పాటి రవి పేర్కొన్నారు. వరంగల్ కార్పొరేషన్లో ఎక్స్అఫీషియో మెంబర్గా ఉండగానే, తొర్రూరు మున్సిపాలిటీలో ఆమెకు అవకాశం కల్పించొద్దని కోరుతూ తొర్రూరు మున్సిపాలిటీ ప్రీసైడింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 11న నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరులో 16 వార్డులకు 9 వార్డులు బీఆర్ఎస్, 7 వార్డులు కాంగ్రెస్ గెలిచింది. పాలకుర్తి ఎమ్మెల్యే ఓటుతో కలిపి బీఆర్ఎస్కు 9, కాంగ్రెస్కు 8 ఓట్లు ఉంటాయి. కడియం కావ్య ఓటు కూడా నమోదైతే రెండు పార్టీల బలం సమానమయ్యే అవకాశం ఉంటుంది.