హైదరాబాద్ : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలకు సంబంధించిన లోగోను ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు రవీంద్రభారతితో బుధవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద్విసప్తాహ వేడుకల లోగోను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ధర్మాన్ని సూచిస్తున్న ధర్మచక్రం జాతీయ పతాకంలో ఉందన్నారు. స్వతంత్ర భారత వ్రజోత్సవ వేడుకల్లో అందరూ పాల్గొనాలన్నారు. నాడు ఆంగ్లేయులు పూర్వీకులను ఎంతో బాధపెట్టారని, మన త్యాగధనులను స్మరించుకునేందుకే వజ్రోత్సవాలని కేకే అన్నారు. ఈ కార్యక్రమం ఎవరికీ పోటీ కాదని.. అందరినీ ఉద్దేశించిందన్నారు.
ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని థియేటర్లలో మహాత్మగాంధీ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. 15 రోజుల పాటు రాష్ట్రమంతటా చారిత్రక ప్రదేశాలల్లో విద్యుద్దీప అలంకరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రవీంద్రభారతీలో 15రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు.. ఫ్రీడమ్ పోటీలు.. రెహమాన్, ఏసుదాసుతో మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కోటి ఇరవై లక్షల జాతీయ జెండాల పంపిణీ జరుగనున్నట్లు పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 8న ఉత్సవాలు ప్రారంభమై.. 22న ఎల్బీ స్టేడియంలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.