హైదరాబాద్: దేశంలో జరుగుతున్న దారుణాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించడం శుభసూచకమని ఎంపీ కే కేశరావు అన్నారు. జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ తరహా అభివృద్ధి నమూనా అమలు చేయాలంటే కేసీఆర్ లాంటి సమర్థ నేత మరో పోరాటానికి పూనుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. హెచ్ఐసీసీలో జరుగుతున్న టీఆర్ఎస్ ప్లీనరీలో ఎంపీ కేకే స్వాగతోపన్యాసం చేశారు. అసమర్ధ కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న పోరాటంలో టీఆర్ఎస్ క్రియాశీల పాత్ర పోషించే సమయం ఆసన్నమైందన్నారు. కేసీఆర్ ఏ కార్యం తలపెట్టినా తెలంగాణ సమాజం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘తెలంగాణ ఇంటి పార్టీ, ప్రజల గుండెల్లో నుంచి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితికి నేటితో 21 ఏండ్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు హృదయ పూర్వక పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. దేశంలో అనేక పార్టీలు ఎంత వేగంగా పుట్టాయో అంతే వేగంగా కాలగర్భంలో కలిసి పోయాయి. తెలంగాణ సాధన కోసం కూడా ఎన్నో పార్టీ లు వచ్చినా లక్ష్యాన్ని చేరుకోకుండానే మాయమయ్యాయి. అయితే కేసీఆర్ పట్టుదల, మొండి తనం, నిజాయితీ, చిత్తశుద్ధి టీఆర్ఎస్ ను నిలిచి గెలిచేలా చేశాయి. కేసీఆర్ అసాధారణ ప్రతిభా పాటవాలు, అకుంఠిత దీక్షాదక్షతలతో పార్టీని ప్రబలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దారు. అనేక అనుమానాలు, అవమానాల మధ్య కఠోరమైన లక్ష్యాన్ని సాధించారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కేసీఆర్ తనకంటూ ఓ బ్లూ ప్రింట్ తయారు చేసుకుని దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నందువల్లే ఇంత తక్కువ వ్యవధిలో మనం అద్భుత విజయాలు సాధిస్తున్నాం.
నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్యమ టాగ్లైన్ సాకారమయ్యే దశకు తెలంగాణ చేరుకున్నందుకు సీఎం కేసీఆర్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విద్యుత్ రంగంలో తెలంగాణ సాధించిన అద్భుతమైన ప్రగతి ఒక్కటి చాలు కేసీఆర్ సమర్ధ పాలకుడని చెప్పడానికి. తెలంగాణ అంధకారమవుతుందని విమర్శించిన వాళ్ల నోళ్లు ఇపుడు మూతపడ్డాయి. కరెంటు వెలుగులతో దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా మారింది.
దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు సైతం కరెంటు కోతలతో సతమతవుతుంటే తెలంగాణ మాత్రం అన్ని రంగాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. తెలంగాణ త్వరలోనే 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన సామర్ధ్యానికి చేరుకుని చరిత్ర సృష్టించ బోతోంది. గతంలో కాగితాలు, శిలాఫలకాలకే పరిమితమైన సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ చేసిన భగీరథ ప్రయత్నం వల్ల ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయి. సాగు తాగునీళ్లకు కటకటలాడిన తెలంగాణ ఇపుడు జల భాండాగారంగా మారింది.
వలసలు లేని ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలకు చోటు లేని తెలంగాణ అని గర్వంగా చేప్పుకునే స్థాయికి చేరుకున్నాం. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్తో వ్యవసాయ రూపు రేఖలే మారిపోయాయి. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో పేదరికం క్రమంగా తగ్గు ముఖం పడుతున్నది. అభివృద్ధికి కొలమానాలుగా భావించే ప్రతి అంశంలోనూ దేశ సగటు కన్నా తెలంగాణ ఎక్కువగానే ఉంది. తెలంగాణ తలసరి ఆదాయం, డీఎస్డీపీ ఎనిమిదేండ్లలోనే రెట్టింపు కావడం ఆర్థిక రంగం ఎంత బలంగా ఉందో చాటిచెబుతున్నది. ఉద్యోగాల కల్పన విషయంలో చూసినా, మౌలిక సదుపాయాల ఏర్పాటులో చూసినా దేశానికి తలమానికంగా మారింది.
అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా చూసుకుని కేసీఆర్ పాలన సాగించబట్టే రాష్ట్రంలో ఇంతటి మార్పు సాధ్యమైంది. తెలంగాణ అభివృద్ధి కళ్ల ముందున్నా, సామాన్యుడికి కూడా ఇది అర్థమైనా.. రోజూ విమర్శలు చేయడమే పనిగాపెట్టుకున్న వారు కారణం లేకుండానే దుష్ప్రచారాలకు దిగడం బాధాకరం. ప్రతిపక్షాల అబద్ధాలు.. పనిచేసే కేసీఆర్ ప్రభుత్వం ముందు నిలవవు. నరనరానా తెలంగాణ మేలునే నింపుకున్న కేసీఆర్ ఆశయం ముందు ప్రత్యర్హుల నక్కజిత్తులు పని చేయవు.
రాష్ట్రంలో ప్రతిపక్షాల తీరు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష ధోరణి తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నాయి. కనీసం రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం రకరకాల ఆంక్షలు పెట్టిన తీరు దుర్మార్గం. ఏ విషయంలోనూ రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం సహకరించకుండా తెలంగాణ ప్రగతి వేగాన్ని తగ్గిస్తున్నది. కేంద్రాన్ని ప్రశ్నిస్తున్న నేతలను రకరకాలుగా వేధిస్తున్నారు. దేశంలో అన్ని వ్యవస్థలను నీరుగార్చే ప్రయత్నం సాగుతోంది. నిజాలు మాట్లాడే వారి గొంతుల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ దాని అనుబంధ సంస్ధలు మతపరమైన అంశాలు తెరపైకి తెస్తూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నాయి.
రానున్న రోజుల్లో కూడా టీఆర్ఎస్ను అజేయంగా ఉంచేందుకు కేసీఆర్ దగ్గర నిర్ధిష్ట ప్రణాళిక ఉంది. తెలంగాణను బాగు చేసుకున్నట్టే దేశాన్ని బాగుచేసే పనిలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ఎంపీ కేకే అన్నారు.