KCR | ప్రపంచం మెచ్చేలా తెలంగాణను పాలించిన నేత కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నామన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తన పకడ్బందీ వ్యూహాలతో సుదీర్ఘకాలం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ప్రపంచంలోనే తెలంగాణకు ఇమేజ్ను సృష్టించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రపంచాన్నే అబ్బురపరిచాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ను ఆదరించడానికి గల కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా నూతన ప్రభుత్వం పనిచేయాలని సూచించారు.