Bandi Sanjay | విద్యానగర్ (కరీంనగర్), డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కారు దరఖాస్తులను ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నామని, కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని దరఖాస్తులకే పరిమితం కావద్దని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. రాష్ట్రంలో రూ.6.75 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ అప్పులు ఎలా తీరుస్తది? ఆరు గ్యారెంటీలను ఎలా అమలు చేస్తది? అనేది వెల్లడించాలని డిమాండ్ చేశారు.
దేశాన్ని అర్ధ శతాబ్దం పాలించిన కాంగ్రెస్ పార్టీ లబ్ధిదారుల కోసం రూపాయి విడుదల చేస్తే కేవలం 15 పైసలు మాత్రమే అందేవని, మిగతావి దళారుల చేతికి వెళ్లేవని రాజీవ్గాంధీ స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో అవినీతికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కరీంనగర్లో సోమవారం నిర్వహించిన మాజీ ప్రధాని వాజపేయి జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిగీ జమాతే సంస్థ సమావేశాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. దీంతో ముస్లిం పేద సమాజానికి ఏమైనా ఉపయోగం ఉన్నదా? అని ప్రశ్నించారు. ఉగ్రవాదులను తయారు చేయడం, బలవంతంగా మతమార్పిళ్లకు పాల్పడే ఈ సంస్థకు నిధులు ఇవ్వడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.