నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): చలో నల్లగొండ బహిరంగసభకు పట్టణ శివారులోని నార్కట్పల్లి-అద్దంకి హైవేకు అనుకుని మర్రిగూడ బైపాస్లో విశాలమైన స్థలంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి నేతృత్వంలో సభా నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా ప్రధాన వేదిక, కళాకారుల వేదిక నిర్మాణం పూర్తి కావస్తుండగా గ్యాలరీల నిర్మాణం, బారి కేడింగ్, పార్కింగ్ స్థలాలను సిద్ధం చేయడం లాంటి పనులన్నీ చకచకా చేపడుతున్నారు. సోమవారం సాయంత్రం వరకు ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఆదివారం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, నాయుడు కంచర్ల కృష్ణారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. మరోవైపు సభకు విస్త్రత ప్రచారం కల్పిస్తూ ప్రజలను కదిలించేందుకు బీఆర్ఎస్ పార్టీ యావత్తు రంగంలోకి దిగింది. కృష్ణానదీ పరివాహాక ప్రాంతాలపై నల్లగొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాలతోపాటు తాగునీటిపై ఆధారపడిన రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి కూడా ప్రజలు తరలిరావచ్చని భావిస్తున్నారు.