నల్లగొండ : మునుగోడు ఎన్నికల్లో ఓటమిపాలైన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి గొల్ల కురుమలకు నిధులిస్తలేరని, నిలిపివేశారంటూ దొంగ నాటకాలు ఆడుతున్నాడని ఎంపీ బడుగులు లింగయ్య యాదవ్ మండిపడ్డారు. చౌటుప్పల్ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఎంపీ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 7,600 మంది గొల్ల కురుమల అకౌంట్లలో అందరు డబ్బులు పడ్డాయన్నారు.
రాజగోపాల్రెడ్డి, బీజేపీ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని, గొల్ల కురుమలపై కుట్రపన్ని డబ్బలు రాకుండా ఆపేశారని.. మళ్లీ నిధులు ఇవ్వడం లేదని ధర్నాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. దేశంలో ఎక్కడా గొల్ల కురుమలకు పథకాలు లేవని, తెలంగాణ ప్రభుత్వం రూ.12వేలకోట్లతో 75వేల కుటుంబాలకు లక్షల సంఖ్యలో గొర్రెలు అందజేసిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుతలో గొర్ల కొనుగోలుకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పారు.
గతంలో రూ.1.25లక్షల సబ్సిడీని ప్రస్తుతం రూ.1.75లక్షలకు పెంచినట్లు ఎంపీ తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు గొల్ల కురుమల తరఫున ధన్యవాదాలు తెలిపారు. పెన్షన్లు, ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గంలో మిషన్ భగీరథ ద్వారా నీరుతెచ్చి ఫ్లోరోసిస్ను దూరం చేశారన్నారు.
ఇప్పటికే మునుగోడు ప్రజలు రాజగోపాల్రెడ్డిని తిరస్కరించారన్నారు. మునుగోడు నియోజకవర్గంలో గొల్ల కురుమలకు అన్యాయం చేసింది బీజేపీ పార్టీ అని, ఇంకనైనా దొంగ దీక్షలు, ధర్నాలు మానుకోవాలని హితవు పలికారు. సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన అయోధ్య యాదవ్, జిల్లా కురుమ సంఘం కోశాధికారి చిన్నం బాలరాజు యాదవ్, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.