MP Badugula Lingaiah Yadav | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండ జిల్లా సమగ్రాభివృద్ధి చెందిందని, జిల్లా అభివృద్ధికి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎనలేని కృషి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఉమ్మడి జిల్లా పౌరుడిగా నల్లగొండ జిల్లా అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా? సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లా హాలియా బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ హయాంలో జరుగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ సారథ్యంలో దశాబ్ది కాలంలోనే జరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన చూసి దేశవ్యాప్తంగా బీఆర్ఎస్కు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వానికి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై చౌకబారు విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని కాంగ్రెస్ నాయకులు పెంచి పోషిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఐదేండ్లలోనే తరిమేసిందని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు ఎడమ కాల్వను ఎండబెట్టి కుడి కాల్వ ద్వారా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోతుంటే పదవులకు ఆశపడి నోరు మూసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు నేడు సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గతంలో ఎడమ కాల్వపై ఉన్న లిఫ్ట్లను కాంగ్రెస్ నాయకులు మూతేసి పడావు పెడితే స్వరాష్ట్రంలో ఎడమ కాల్వపై ఉన్న పాత లిఫ్ట్లను పునరుద్ధరించడంతో పాటు జిల్లాలో చివరి భూములకు సాగునీరు అందించేందుకు రూ.4వేలకోట్ల నూతన లిఫ్ట్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఇంటింటికీ తాగునీరు ఇవ్వడంతోపాటు జిల్లాలోని టేలాండ్ భూములకు సాగునీరు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోనికి రావడం ఖాయమని స్పష్టం చేశారు. పీపీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన దొంగని, ఆయనవి బ్లాక్ మొయిల్ రాజకీయాలేనని అన్నారు. డబ్బులు ఇచ్చి పీసీసీ పదవి కొనుకున్న ఘనుడు రేవంత్ రెడ్డి అని ఆ పార్టీ నాయకులే నేడు ఆరోపిస్తున్నారన్నారు.
నల్లగొండ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా అభివృద్ధిపై అన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. నల్లగొండ జిల్లా ప్రజలు ఎంతో చైతన్యవంతులని, కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లా ప్రజలు దశాబ్ద కాలం క్రితమే తిరస్కరించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర కాదుకదా మోకాళ్లతో నడిచి యాత్ర చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో నల్లాల వద్ద మంచినీళ్ల కోసం మహిళలు, దుకాణాల వద్ద ఎరువుల కోసం రైతులు క్యూ కట్టిన సంగతిని ఆయన గుర్తు చేశారు. రాష్టంలోగానీ, జిల్లాలోగానీ కాంగ్రెస్ నాయకుల మధ్యనే సఖ్యత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లో పాల్గొని ప్రజలకు చేసిన పాపాన్ని కడుక్కోవాలని సూచించారు.