Telangana | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీని కలిపే రెండు ప్రధాన రహదారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ రహదారి (ఎన్హెచ్ 65)ను 6 లేన్లు, హైదరాబాద్-కల్వకుర్తి మార్గాన్ని 4 లేన్లకు విస్తరించాలని గతంలో కేసీఆర్ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కేంద్రం పక్కన పెట్టింది. దీంతో ఈ రెండు మార్గాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. ఎన్హెచ్ 65పై ప్రస్తుతం రోజూ 50 వేలకుపైగా వాహనాలు తిరుగుతున్నట్లు టోల్ ప్లాజా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. కానీ, రాష్ట్ర విభజన వల్ల ఈ రోడ్డుపై ట్రాఫిక్ తగ్గిందని, దీంతో టోల్ ద్వారా తమకు వచ్చే ఆదాయం పడిపోయిందని కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ చెప్తున్నది. దీంతో ఈ రహదారిని 6 లేన్లకు విస్తరించడం సాధ్యంకాదని చేతులెత్తేసింది.
ఈ వ్యవహారం కోర్టుకు చేరడంతో రహదారిని ఆరు లేన్లుగా అభివృద్ధి చేయాలన్న ఒప్పందం అటకెక్కింది. దీంతో తెలంగాణ, ఏపీ రాజధానులను కలిపే ఈ మార్గంలో రోజూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పండుగల సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడి కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోతున్నాయి. హైదరాబాద్-కల్వకుర్తి మధ్య ప్రస్తుతమున్న ఎన్హెచ్-765ని నాలుగు లేన్లకు విస్తరించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే, దీనికి అనుబంధంగా కల్వకుర్తి నుంచి కొల్లాపూర్, కరివెన మీదుగా ఏపీలోని నంద్యాల వరకు ఎన్హెచ్-167కే పేరుతో కొత్తగా హైవే నిర్మిస్తున్నది. దీంతో హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై మధ్య ప్రయాణ దూరం దాదాపు 80 కి.మీ. తగ్గుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల రీత్యా హైదరాబాద్ (ఓఆర్ఆర్) నుంచి కల్వకుర్తి (ఎన్హెచ్ 765) వరకు ఉన్న 2 లేన్ల రోడ్డును 4 లేన్లకు విస్తరించాలని వాహనదారు లు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయిస్తే తెలుగు రాష్ర్టాల వాహనదారులకు ఎంతో ఉపశమనం లభిస్తుంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణ పట్ల కక్షతో ఈ ప్రాజక్టులను ముందుకు సాగకుండా చేసింది. దీంతో గత పదేండ్ల నుంచి ఈ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలైనా ఇంతవరకు ఈ రెండు ప్రధాన రహదారులపై దృష్టి కేంద్రీకరించకపోవడం విమర్శలకు తావిస్తున్నది.