హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ‘మాదిగ జాతిని పార్లమెంట్లో కూర్చొనివ్వరా? మాకు ఒక్క ఎంపీ టికెట్టు కూడా ఇవ్వారా? ఇది న్యాయమేనా?’ అని కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాదిగలకు టికెట్లు ఇస్తే.. కాంగ్రెస్ మాత్రం దూరం పెట్టిందని, ఇది చారిత్రక తప్పిదమని మండిపడ్డారు. బరువెకిన హృదయంతో మాట్లాడుతున్నానని, తనకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా బాధపడలేదని చెప్పారు.
రాష్ట్రంలో మూడు ఎంపీ స్థానాలను ఎస్సీలకు రిజర్వ్ చేసినా తమకు అన్యాయమే జరుగుతున్నదని, అసలు తెలంగాణలో రిజర్వేషన్లు ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు. మాదిగలను చట్టసభలకు దూరం పెడితే కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించారు. చాలామంది ముఖ్యమంత్రులను చూశానని, కానీ రేవంత్రెడ్డిలా మాదిగలను దూరం పెట్టిన సీఎంను ఎన్నడూ చూడలేదని ధ్వజమెత్తారు. ఎవరో చెప్పిన మాటలు విని పార్టీకి అన్యాయం చేయొద్దని, రేవంత్రెడ్డి తప్పు సరిదిద్దుకోవాలని, ఈ విషయం తాను ఒక అన్నలా చెప్తున్నానని పేర్కొన్నారు.
తనకు పార్టీ మారే ఆలోచన లేదని, రేవంత్రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. సీఎం తనకు సమయం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి రెండు, మూడు టికెట్లు ఇచ్చి, మాదిగ జాతికి ఒక్క సీటు కూడా ఇవ్వరా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేత పిడమర్తి రవి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలకు తకువ సీట్లు ఇచ్చారని, ఇప్పుడు కూడా ఇవ్వడం లేదని అన్నారు. టికెట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం జరుగుతున్నదని ధ్వజమెత్తారు. మందకృష్ణ మాదిగ వర్గీకరణ పేరుతో మాదిగలను బీజేపీ వైపు తీసుకెళ్తున్నాడని,కాంగ్రెస్ మాదిగలకు అన్యాయం చేస్తే బీజేపీకి లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.