Motkupalli Narasimhulu | హైదరాబాద్ : తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మాదిగ జాతికి కాంగ్రెస్ పార్టీ ఒక్క టికెట్ కూడా కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆ పార్టీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలను అంటరానివారిగా చూడొద్దని రేవంత్ రెడ్డిని మోత్కుపల్లి హెచ్చరించారు.
చాలా బారువెక్కిన హృదయంతో మాట్లాడుతున్నాను. నీతి నిజాయితీగా బతికిన నేను ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని పార్టీలో చేరాను. నాకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా బాధపడలేదు. కానీ మొత్తం మాదిగ జాతిని దూరం పెట్టడం దురదృష్టకరం. 17 లోక్సభ స్థానాల్లో మూడు ఎస్సీలకు రిజర్వ్ చేయబడ్డాయి. వాటిలో ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించలేదు. మాదిగ కులానికి సీట్లు లేవన్నట్లు వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఇలా మమ్మల్ని దూరం పెడితే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి..? అని మోత్కుపల్లి ప్రశ్నించారు.
నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసాను. కానీ రేవంత్ రెడ్డిలా మాదిగలను దూరం పెట్టినవాళ్లను చూడలేదు. సీఎంను, మంత్రులను అడుగుతున్నా.. మీకిది న్యాయమేనా..? కేసీఆర్ మాదిగలకు టికెట్లు ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ఎందుకు మాదిగలను దూరం పెడుతోంది. ఇది కాంగ్రెస్కు నష్టం చేస్తుంది. రేవంత్ రెడ్డికి అన్నగా ఈ మాట చెబుతున్న.. ఎవరో చెప్పిన మాటలు విని మాదిగలకు అన్యాయం చేయొద్దు. మాదిగలకు టికెట్లు ఇవ్వకపోవడం చారిత్రాత్మక తప్పు. రేవంత్ రెడ్డి ఆలోచించుకొని, తన తప్పును సరిదిద్దుకోవాలని మోత్కుపల్లి నర్సింహులు సూచించారు.
మాదిగలకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడుదామంటే సీఎం నాకు సమయం ఇవ్వడం లేదు. మాదిగ జాతికి న్యాయం చేయండి. నేను మానసికంగా కృంగిపోతున్నా. మాదిగలకు జరుగుతున్న అన్యాయం చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మాదిగ బాధపడుతున్నాడు. ఒకే కుటుంబంలో రెండు, మూడు టికెట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముంది.? ఒక్క సీటుకు కూడా మా మాదిగలు అర్హులు కారా..? మాదిగ కులానికి పార్లమెంట్లో కూర్చునే అవకాశం కల్పించండి. మమ్మల్ని అంటరానివారిగా చూడొద్దు. తాను వరంగల్ ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నా అని మోత్కుపల్లి పేర్కొన్నారు.