హైదరాబాద్: దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ (BJP) నేతలకు లేదని టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు (Mothkupally Narsimhulu) అన్నారు. దళితబంధు (Dalitha bandhu) అమలైతే దళితులంతా కేసీఆర్ వెంట ఉంటారని భయపడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్లో మోత్కుపల్లి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ దళిత బంధు ఉండాలనుకుంటున్నాడా లేదా వద్దనుకుంటున్నాడా అని ప్రశ్నించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా దళితబంధు లాంటి పథకం ఉందా అని ప్రశ్నించారు. ఒక దళితుడిగా బీజేపీ చర్యలను ఖండిస్తున్నానని చెప్పారు. 70 ఏండ్లలో దళితులకు ఏనాడూ న్యాయం జరగలేదన్నారు. అంబేద్కర్ ఆలోచనలు అమలుచేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని తేల్చిచెప్పారు.
బండి సంజయ్కి సిగ్గులేదని, తమ కులం వెంట పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్ను టచ్ చేస్తే మాడిపోతారన్నారు. ఎన్నికల ముందు ప్రధాని మోదీ ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు జమచేస్తామన్నారని, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కుల వ్యవస్థ నిర్మూలించాలని సీఎం కేసీఆర్ నడుం కట్టారని చెప్పారు.
కేంద్రం అన్ని రంగాలను ప్రైవేట్పరం చేస్తున్నదని, బడుగుబలహీన వర్గాలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ పెంచితే ప్రజలు ఎట్ల బతుకుతారని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ఉచిత కరెంటు, సాగునీరు, పెట్టుబడి సాయం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. ప్రతి గుంట భూమికి రైతుబంధు ఇస్తున్న నాయకుడు కేసీఆర్ అని చెప్పారు. బీజేపీకి దమ్ముంటే దేశమంతా దళితబంధు అమలుచేయాలని సవాల్ విసిరారు. బీజేపీకి వ్యతిరేకంగా ఊరూరా నిరసనలు తెలుపుతామన్నారు. బండి సంజయ్ అరిచేదేదో ఢిల్లీకి వెళ్లి అరవాలని సూచించారు.
బీజేపీ, కాంగ్రెస్ అపవిత్ర కలయిక వల్ల ఈటల గెలిచారని విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో మూడు వేల ఓట్లే వచ్చినా రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా పీసీసీ చీఫ్గా కొనసాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఓట్లను గుండుగుత్తగా ఈటలకు అమ్ముకున్నాడని ఆరోపించారు.
బీజేపీ వాపును చూసి బలుపు అనుకుంటుంన్నదని ఎద్దేవా చేశారు. ఆపార్టీ దుర్మార్గపు పాలనలో రైతులు చనిపోతున్నారని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో రైతులను కార్లతో తొక్కించి చంపుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా బీజేపీ తీరు మారడంలేదని విమర్శించారు. ఎన్నికలొస్తే సర్జికల్ స్ట్రైక్స్ అని బీజేపీ డ్రామాలు చేస్తుందన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి దొంగలు కేంద్రం పెద్దలకు తెలియకుండా దేశం దాటిపోయారా అని ప్రశ్నించారు. దొంగల నుంచి ముడుపులు అందుకున్నది బీజేపీ నేతలేనని ఆరోపించారు. దొంగలకు సద్దికట్టే ప్రభుత్వం బీజేపీ అని విమర్శించారు. నీతిమంతులెవరూ బీజేపీలో ఉండలేరని చెప్పారు. పేదలు, దళితులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని మోత్కుపల్లి చెప్పారు.