వరంగల్ : గొప్ప మానవతామూర్తి, మానవాళి సంక్షేమానికి తన జీవితాన్ని దారపోసిన మదర్ థెరీసా సేవలు శ్లాఘనీయమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మదర్ థెరీసా వర్ధంతి సందర్భంగా కాజీపేట ఫాతిమా చౌరస్తాలో మదర్ థెరీసా విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడో మాసిడోనియాలో పుట్టి, మన దేశానికి వచ్చి, మిషనరీ సంస్థను పెట్టి, ఇక్కడి ప్రజలకు అమ్మలా సేవలు చేయడం గొప్ప విషయం అన్నారు.
మదర్ థెరీసా స్ఫూర్తితో మిషనరీ సంస్థలు కుల,మతాలకు అతీతంగా నిరుపేదలకు సాయం చేస్తున్నాయని, రానున్న రోజుల్లో వారి సేవలను ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లి ప్రజలకు మరిన్ని అవసరం అయ్యే పనులను చేపట్టాలని మంత్రి కోరారు. మంచి పనులు చేపట్టే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
మదర్ థెరీసా విగ్రహ ప్రాంగణంలో మొక్క నాటుతున్న మంత్రి ఎర్రబెల్లి
అలాగే వల్మీడి గ్రామంలో నిన్న జరిగిన శ్రీ సీతారామచంద్ర దేవాలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి బిషప్ రావడం పట్ల మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మదర్ థెరీసా విగ్రహ ప్రాంగణంలో మంత్రి ఎర్రబెల్లి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.