కొడుకు మంచిగా చదువుకోవాలని ఆ తల్లి తపనపడింది. మంచి ఉద్యోగం సాధించి ఉన్నతస్థానంలో ఉండాలని ఆరాటపడింది. కానీ, చెడుస్నేహాలవల్ల ఆ కొడుకు గంజాయికి బానిసయ్యాడు. రోజూ గంజాయి మత్తులో ఊగిపోతున్నాడు. కళ్లముందే తాను కన్న కల గంజాయి రూపంలో ఆవిరవుతుంటే ఆ తల్లి తట్టుకోలేకపోయింది. కొడుకును ఎలాగైనా దారికితెచ్చుకోవాలని మమకారం చంపుకుని కొడుకును తాళ్లతో చెట్టుకు కట్టేసి కంట్లో కారంపెట్టింది.
ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో జరిగింది. గంజాయికి బానిసైన కొడుకుకు తల్లి తగిన బుద్ధిచెప్పింది. గంజాయి తాగి ఇంటికివచ్చిన కొడుకును ఇరుగుపొరుగువాళ్ల సాయంతో ఆ తల్లి చెట్టుకు తాళ్లతో కట్టేసింది. ఆ తర్వాత కారం తీసుకొచ్చి కళ్లలో కొట్టింది. ఆ కొడుకు గిలగిలా కొట్టుకుంటుంటే లోలోపల కుమిలిపోయిన ఆ తల్లి..గంజాయి బారినుంచి కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని కన్నీళ్లను దిగమింగింది. చెట్టంత కొడుకు ఓ వ్యసనానికి బానిసై చేతికిరాకుండా పోతుంటే తొవ్వకు తెచ్చుకునేందుకు తాను ఈ పని చేయక తప్పలేదని ఆ తల్లి వాపోయింది. ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్ అయ్యింది.
గంజాయికి బానిసైన కొడుకును తాళ్లతోకట్టి కంట్లో కారంకొట్టిన తల్లి pic.twitter.com/U8cuIVPJsX
— Namasthe Telangana (@ntdailyonline) April 4, 2022