ఢిల్లీలో తల్లి, ఇద్దరు కూతుర్ల ఆత్మహత్య
న్యూఢిల్లీ, మే 22: దక్షిణ ఢిల్లీలో సంపన్నులు ఉండే వసంత్ విహార్ ప్రాంతం అది. అక్కడ ఓ ఇంట్లో తల్లి, ఇద్దరు కూతుర్లు చనిపోవాలని నిర్ణయించుకొన్నారు. ఇంటి తలుపులు మూసేశారు. కిటికీలన్నీ వేసుకొన్నారు. ఇంట్లో గాలి కొంచెం కూడా బయటకు పోకుండా వెంటిలేటర్లను కవర్లతో సీల్ చేశారు. వంటింట్లోకి వెళ్లి సిలిండర్ ఆన్ చేశారు. అప్పటికే తెచ్చి పెట్టుకొన్న బొగ్గును మండించి బెడ్ రూమ్లోకి వెళ్లి పడుకొన్నారు.
బొగ్గు మండుతున్న కొద్దీ కార్బన్ మోనాక్సైడ్ ఇల్లంతా వ్యాపించింది. గ్యాస్ చాంబర్లా తయారైంది. ఆ వాయువును పీల్చుకొని ముగ్గురు అదే బెడ్ రూంలో ఒకే బెడ్పై చనిపోయారు. తల్లి పేరు మంజు శ్రీవాస్తవ. కూతుర్లు అన్షిక, అంకు. మంజు భర్త ఏడాది క్రితం కొవిడ్తో చనిపోయారు. మంజు ఆరోగ్యం కూడా కొంతకాలంగా బాగుండటం లేదు. దీంతో, ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకొన్నది. ఆత్మహత్యకు ముందు వాళ్లు సూసైడ్ నోట్ రాశారు. ‘ఇల్లంతా విషవాయువు ఉంది. ఎవరూ పీల్చుకోవద్దు. రాగానే కిటికీలు, వెంటిలేటర్లు తెరవండి. నిప్పు వెలిగించకండి’ అని అందులో పేర్కొన్నారు.