హైదరాబాద్ : గద్వాల జిల్లాలో(Gadwala district) విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిండు ప్రాణాలను బలితీసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల పరిధిలోని ఏ-బుడిదపాడు గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏ-బుడిదపాడు గ్రామానికి చెందిన మాల నరసింహులు(45) తన భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18) కుటుంబ కలహాల నేపథ్యంలో ముగ్గురు కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిన్న సాయంత్రం (మంగళవారం) ఇంట్లోనే పురుగుల మందు(Drinking pesticides) తాగారు.
ఈ సంఘటనలో వరలక్ష్మి, అనురాధ పరిస్థితి తీవ్రంగా ఉండడంతో హుటాహుటిన స్థానికులు కర్నూల్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అప్పటికే తల్లి,కూతరు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. నరసింహులు మాత్రం ఆత్మహత్య చేసుకోవాలని భావించినా పురుగుల మందు తాగలేక పోయాడని.. తన కళ్ల ముందు భార్య కూతురు చనిపోవడంతో కుప్ప కూలిపోయాడు. కాగా, గత కొన్ని రోజులుగా నరసింహులుకు తన అన్నదమ్ముల మధ్య భూమి తగాదాలు, కుటుంబ గొడవలు జరిగినట్లు స్థానికులు తెలిపారు. వరలక్ష్మి,అనురాధ మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.