హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): హెల్మెట్ పెట్టుకొంటే మీకే రక్షణ అంటే వినరు.. సిగ్నల్ జంప్ చేస్తే ప్రమాదాలు జరుగుతాయి అని చెప్తే పట్టించుకోరు.. స్పీడ్గా వెళ్తే బైక్, కారు అదుపు తప్పి ప్రాణాలు పోతాయి అని అంటే మాకేంకాదని
మొండికేస్తారు.. పోనీ, ఫైన్ వేస్తేనన్నా వింటారు అనుకొంటే అదే అజాగ్రత్త, అదే నిర్లక్ష్య వైఖరి. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదంటే.. కేవలం 11 నెలల్లోనే (ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 30 వరకు) రాష్ట్రంలో కోటిన్నర ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన 1,35,915 మందిపై కేసులు నమోదుచేసి కోర్టుకు పంపినట్టు పోలీసులు తెలిపారు. నిబంధనల అతిక్రమణకు గాను మొత్తం రూ.533,95,91,700 జరిమానా విధించినట్టు వెల్లడించారు. ఇక.. జనవరి నుంచి నవంబర్ వరకు 6,651 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. మరో 6,243 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓఆర్ఆర్ పరిధిలోని ప్రమాదాల్లోనే ఎక్కువ మంది మృతి చెందారు. 2020, 2021 నవంబర్ వరకు కలిపి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,404 మృతిచెందారు. ఆ తర్వాత సంగారెడ్డి జిల్లా పరిధిలో 740 మంది మరణించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ప్రమాదాల్లోనూ రెండేండ్లలో 742 మంది ప్రాణాలు కోల్పోయారు.