హైదరాబాద్, మార్చి 27 : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్నాయి. గతేడాది లీటర్ పెట్రోల్ ధర రూ.100 నుంచి రూ.110కి, డీజిల్ ధర రూ.90 నుంచి రూ.100కు పెరిగింది. ఇటీవల ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు కొన్ని నెలలపాటు స్థిరంగా కొనసాగినప్పటికీ.. ఆ ఎన్నికలు ముగియగానే మళ్లీ బాదుడు మొదలైంది. ఫలితంగా గత ఐదు రోజుల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.3.60, డీజిల్ ధర రూ.3.48 వరకు పెరిగింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 100 డాలర్లు దాటుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ‘లోకల్ సర్కిల్స్’ సంస్థ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించగా.. పెట్రో ధరల పెంపు భారాన్ని మోయలేమని 42% మంది తేల్చిచెప్పారు. కరోనా సంక్షోభం కారణంగా తమ ఆదాయం పొదుపు తగ్గుతాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ధరలు కూడా పెరిగితే తాము మరిన్ని కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. దేశంలోని 361 జిల్లాల నుంచి 27 వేల మందికిపైగా ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 66% మంది పురుషులు, 34% మంది స్త్రీలు ఉన్నారు. టైర్-1 పట్టణాల నుంచి 42%, టైర్-2 నుంచి 34%, టైర్-3,4 పట్టణాల నుంచి 24% మంది సర్వేలో పాల్గొన్నారు.