హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది వానకాలం సీజన్ ఆశాజనకంగా మారింది. సీజన్ ప్రారంభంలో నైరుతి రుతుపవనాల రాక అనుకున్న సమయం కంటే ఆలస్యమైంది. ఫలితంగా ఈ ఏడాది కరువు తప్పదనే అభిప్రాయం తలెత్తింది. కానీ జూలై రెండో వారం తర్వాత రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించడంతోపాటు రాష్ట్రంలోనూ విస్తరించాయి. వీటికి తోడు బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండంతో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కుంభవృష్టిని తలపించేలా రెండు వారాలపాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సాధారణ స్థాయిని మించి వర్షపాతం నమోదైంది.
ఈ సీజన్లో రాష్ట్రంలో ఆదివారం నాటికి 571 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏటా వానకాలంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో 900 నుంచి 1,500మి.మీ, దక్షిణ భారతదేశంలో 700 నుంచి 900 మి.మీ వరకు వర్షపాతం నమోదవుతుంది. గత ఏడాది జూలై 30 వరకు రాష్ట్రంలో 327 మి.మీ, సీజన్లో 1,257 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటివరకు 571 మి.మీ వర్షపాతం రికార్డయ్యింది. సీజన్ మరో రెండు నెలలు మిగిలి ఉన్నది. దీంతో రాష్ట్రంలో ఈ ఏడాది కూడా మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జూలై 17 నుంచి 28 వరకు 321 మి.మీ వర్షపాతం నమోదైంది.