కరీంనగర్, జనవరి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఏటా చెల్లిస్తున్న ఆదాయ పన్ను (ఐటీ) దాదాపు రూ.5 వేల కోట్లపైమాటే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వాస్తవం ఇదే. స్వరాష్ట్రంలో డీఏ, హెచ్ఆర్ఏ సహా ఉద్యోగుల వేతనాలు 50% పెరిగితే.. వాటిని ఐటీ, సర్చార్జీల రూపంలో కేంద్ర ప్రభుత్వం దిగమింగుతున్నది. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఐటీ పరిమితిని పెంచలేదు. పొదుపు, స్టాండర్డ్ డిడక్షన్ పరిమితులను కూడా ఎనిమిదేండ్ల నుంచి పెంచకుండా బీజేపీ ప్రభుత్వం వేతనజీవులకు చుక్కలు చూపిస్తున్నది. అధికారంలోకి వస్తే ఐటీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు చెప్పిన బీజేపీ నాయకులు.. నేటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి బడ్జెట్లోనైనా కేంద్రం ఐటీ పరిమితిని పెంచుతుందో లేదోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.
ఎనిమిదేండ్లుగా ఎదురుచూపులే
దేశంలో రోజురోజుకూ అధికమవుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగుల వేతనాలు పెరిగినా ఆ సంతోషం ఎంతోసేపు నిలవడం లేదు. ఎనిమిదేండ్ల నుంచి కేంద్రం ఐటీ పరిమితిని పెంచకపోవడమే ఇందుకు కారణం. గతంలో ఒక్క శ్లాబ్ ఉంటే.. కొత్తగా మరో శ్లాబ్ను ప్రవేశపెట్టి రెండు శ్లాబులను అమలు చేస్తున్నది. కనీసం స్టాండర్డ్ డిడక్షన్, పొదుపు మినహాయింపుల పరిమితులను కూడా పెంచడం లేదు. మొదటి శ్లాబ్ ప్రకారం.. వార్షికాదాయం రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉన్నవారు 5%, రూ.5-10 లక్షల ఆదాయమున్నవారు 20%, రూ.10 లక్షలకుపైగా ఆదాయమున్నవారు 30% పన్ను చెల్లించాలి.
బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రెండో శ్లాబ్ ప్రకారం.. రూ.2.50-5 లక్షల ఆదాయమున్నవారు 5%, రూ.5-7.50 లక్షల ఆదాయమున్నవారు 10%, రూ.7.50-10 లక్షల ఆదాయమున్నవారు 15%, రూ.15-12.50 లక్షల ఆదాయమున్నవారు 20%, రూ.15 లక్షలకుపైగా ఆదాయమున్నవారు 30% పన్ను చెల్లించాల్సి వస్తున్నది. వీటిలో నచ్చిన శ్లాబును ఎంచుకునే వెసులుబాటు ఉండటంతో చాలా మంది ఉద్యోగులు రెండో శ్లాబ్ను పక్కన పెట్టారు. ఈ శ్లాబ్లో పొదుపుపై రూ.లక్షన్నర పన్ను మినహాయింపు వర్తించకపోవడమే ఇందుకు కారణం.
శ్లాబులను సవరించాల్సిందే
ఈ శ్లాబ్లను మార్చి ఐటీ పరిమితిని రూ.5 లక్షలకు, పొదుపు పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని ఉద్యోగులు చాలా ఏండ్లుగా కోరుతున్నారు. కానీ, మోదీ సర్కారు మాత్రం ప్రతి బడ్జెట్లో వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లుతూనే ఉన్నది. దీంతో ఏటా లక్షల్లో పన్ను చెల్లించి జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తున్నదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ సారైనా బడ్జెట్లో ఐటీ శ్లాబులను సవరించకపోతే ఉద్యమం తప్పదని పలు ఉద్యోగ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.
ఏటా 4 నెలల వేతనం ఐటీకే
తెలంగాణలో 3.5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. గత ఎనిమిదేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం రెండు పీఆర్సీలు అమలు చేసింది. 2014లో 43 శాతం ఫిట్మెంట్తో ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. 2020లో 30 శాతం ఫిట్మెంట్తో మరోసారి వేతనాలు పెంచింది. దీంతో తెలంగాణలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు 2013లో ఉమ్మడి రాష్ట్రంలో పొందిన వేతనాల కంటే రెట్టింపు జీతాలు అందుకొంటున్నారు. కానీ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఐటీ రూపంలో వారి జేబులు గుల్ల చేస్తున్నది.
రూ.లక్ష వేతనం పొందుతున్న ప్రతి ఉద్యోగి నుంచి నెలకు దాదాపు రూ.30 వేల పన్ను వసూలు చేస్తున్నది. ఇలా సంవత్సరంలో దాదాపు 4 నెలల వేతనం ఐటీ చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తున్నదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఒక్కో ఉద్యోగి ఏటా సగటున రూ.లక్షన్నర ఐటీ చెల్లిస్తున్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ లెక్కన రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏటా చెల్లిస్తున్న పన్ను రూ.5 వేల కోట్ల పైమాటే.