భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికల జోరు కొనసాగుతున్నది. నాందేడ్, కంధార్ -లోహా వంటి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల నుంచి మొదలైన ఈ చేరికల పర్వం, మధ్య మహారాష్ట్రకు చేరుకొన్నది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు ఆదివారం హైదరాబాద్లో గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
BRS | హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): శివసేన సీనియర్ నేత, రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అన్నా సాహెబ్ మానె ఆదివారం బీఆర్ఎస్లో చేరగా.. సీఎం కేసీఆర్ ఆయనను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అన్నా సాహెబ్తోపాటు గంగాపూర్ నియోజకవర్గానికి చెందిన సంతోష్కుమార్, ఔరంగాబాద్ ఎన్సీపీ యూత్ ప్రెసిడెంట్ ప్రశాంత్ పాటిల్ కూడా పార్టీలో చేరారు. సంతోష్కుమార్ గత ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున గంగాపూర్ నుంచి పోటీ చేశారు. 82 వేల ఓట్లు సాధించారు.
ఔరంగాబాద్ జిల్లావ్యాప్తంగా రాజకీయంగా పట్టు, ప్రజల్లో ఆదరణ ఉన్న ముగ్గురు నాయకులు ఒకేరోజు బీఆర్ఎస్ గూటికి చేరడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఈ నెల 24న ఔరంగాబాద్లో భారీ సభ నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీలో ఈ చేరికలు జోష్ను నింపాయి. సభ నిర్వహణకు ముందే విజయ సంకేతం లభించింది. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు నాయకులు, ప్రజలనుంచి వస్తున్న ఆదరణకు ఈ చేరికలు అద్దంపడుతున్నాయి. ఈ చేరికల కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల సుమన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.