నల్లగొండ: మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. హైదరాబాద్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు ఏడు గేట్లు రెండు అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8,764.52 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 12,099 .18 క్యూసెక్కుల వరద బయటకు వెళ్తున్నది. మూసీ పూర్తిస్థాయి సామర్థ్యం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 641.25 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. ఇప్పుడు 3.33 టీఎంసీల వద్ద నీరు నిల్వ ఉన్నది.
కాగా, భారీ వరదతో అనంతారం వద్ద మూసి ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. నదిలో 230.5 మీటర్ల వద్ద నీటిమట్టం ఉన్నది. వదర ఉధృతి ప్రమాదకర స్థితిలో ఉన్నదని కేంద్ర జలసంఘం హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. యాదాద్రి జిల్లాలోని భీమలింగంలో లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీనది పారుతున్నది.