Moosaram Bagh Bridge | సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగర పరిధిలో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేకించి మూసారాంబాగ్ వద్ద వంతెనను ఆనుకుని వరద ప్రవాహం వెళుతున్నది. క్రమంగా వరద ప్రవాహం పెరుగుతుండటంతో వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు నిర్ణయించారు.
మంగళవారం రాత్రి 9 గంటల నుంచి మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిపేస్తున్నట్లు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ఆరువేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో మూసీ వరద ప్రవాహం పెరిగింది. మూసారాం బాగ్ వద్ద వంతెన మీదుగా వరద ఉధృతంగా వెళుతున్నది.
బుధవారం వరద ప్రవాహ పరిస్థితిని సమీక్షించిన తర్వాత మూసారాం బాగ్ వంతెనపై వాహనాల రాకపోకలను అనుమతించాలా.. వద్దా.. అనే నిర్ణయం తీసుకుంటామని అరవింద్ కుమార్ చెప్పారు. ఎగువ ప్రాంతాల నుంచి హిమాయత్ సాగర్కు నాలుగు వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది.
దీంతో ఆరు గేట్ల ద్వారా హిమాయత్ సాగర్ నుంచి మూసీ నదిలోకి 4,120 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు. దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టం నిండిపోయి హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది.
ఇక ఉస్మాన్ సాగర్కు ఎగువ ప్రాంతాల నుంచి రెండు క్యూసెక్కుల నీరు వస్తోంది. ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి వరద చేరుకోవడంతో ఆరు గేట్ల ద్వారా 2028 క్యూసెక్కుల నీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు.