Monsoon | హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): వాతావరణశాఖ చల్లనికబురు.. ఇప్పటికే 12 రోజులు ఆలస్యంగా మాన్సూన్ ఎండలు, వడగాడ్పుల తీవ్రతను సమీక్షించేందుకు రాష్ర్టాలకు కేంద్ర బృందాలు చెమటలు కక్కించిన ప్రచండ భానుడికి నైరుతి రుతుపవనాలు బైబై చెప్పనున్నాయి. ఎప్పుడెప్పుడా.. అని ఎదురు చూసిన జనాలకు నల్లని మబ్బులు చల్లటి కబురు మోసుకొచ్చాయి. రేపు రుతుపవనాలు రాష్ట్రంలో అడుగుపెడుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వార్త కోసమే నిరీక్షిస్తున్న ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది.
తొలకరిజల్లుతో పులకరించి మట్టి పంచే పరిమళం ఆస్వాదించటానికి ఆబాలగోపాలం ఆశగా ఎదురుచూస్తున్నది. మెరుపుల విరుపులతో.. మేఘాల పెళపెళరావాలతో వర్షం కుండపోతగా కురిస్తే.. మోడులన్నీ కొత్త చివుర్లు తొడుక్కుంటాయి. ఎండిన నాగేటిచాల్లన్నీ పుడమి మెడలో పచ్చలహారాలు అవుతాయి. వాగులు, వంకలు కొత్తనీటి రాకతో చేపపిల్లల్లా ఎగెరెగిరి దుంకుతాయి. సంబురంగా పొలంబాట పట్టేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం
అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రజలకు నైరుతి రుతుపవనాలు కాస్త ఉపశమనం కలిగించేలా సంకేతాలు అందించాయి. ఈ నెల 11 నుంచి కర్ణాటక-ఏపీ సరిహద్దుల వద్ద నిలిచిపోయిన రుతుపవనాల్లో కదలిక ప్రారంభమైంది. గురువారం నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేస్తున్నది. ఈ నెల 10వ తేదీకే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉండగా, ప్రతికూల పరిస్థితుల కారణంగా ఆగమనం ఆలస్యం అవుతున్నదని వెల్లడించింది. బుధవారం రాష్ట్రంలోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. మంగళవారం నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. మాడ్గులపల్లి మండలంలోని పాములపాడులో గొర్రెలను మేపేందుకు వెళ్లిన కునుకుంట్ల గోపి (20) పిడుగుపాటుతో మృతిచెందాడు.
మంగళవారం మండిన ఎండ
మంగళవారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల సాధారణం కన్నా 6 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 13 జిల్లాల్లోని దాదాపు 36 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో గరిష్ఠంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కేంద్ర బృందం సమీక్ష
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వడగాడ్పులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ర్టాల్లో వేడి తీవ్రతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై ఐఎండీకి చెందిన ఐదుగురు అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించనున్నది.