Northeast Monsoon | హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ)/న్యూఢిల్లీ: ఈ ఏడాది రుతుపవన కాలంలో దేశంలో మం చి వర్షాలే పడుతాయని, జూన్-సెప్టెంబర్ మధ్య 96 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికీ మంచి వర్షాలే పడుతాయని పేర్కొన్న ఐఎండీ.. వాయవ్య భారత్లో కొద్దిగా తక్కువగా వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. ఇదే సమయంలో జూన్ 1కి రుతుపవనాలు భారత్ను తాకే అవకాశం లేదని, 4వ తేదీ నాటికి కేరళకు వస్తాయని వాతావరణ సంస్థ పేర్కొన్నది. రానున్న రెండు రోజుల్లో రుతుపవనాలు సానుకూలంగా ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఈ ఏడాది రుతుపవన సమయంలో హిందూ మహాసముద్రంలో అభివృద్ధి చెందే సానుకూల ఇండియన్ ఓషియన్ డైపోల్(ఐవోడీ) ఎల్నినో ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుందని, తద్వారా దేశంలో సాధారణ వర్షాలు పడుతాయని పేర్కొన్నది.
ఒకవేళ దేశమంతా ఒకే తరహాలో వర్షపాతం నమోదైతే అనుకూల పరిస్థితులే ఉంటాయని, వ్యవసాయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదు అని తెలిపింది. ఈ ఏడాది లోటు వర్షపాతం ఉంటుందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ అంచనా వేసిన మరుసటి రోజే ఐఎండీ ఈ మేరకు ప్రకటన చేసింది. భారత్లో నైరుతి రుతుపవనాల సీజన్లో సాధారణ వర్షపాతం కనిపిస్తుందని, దాదాపు 87 సెంటీమీటర్ల దీర్ఘకాల సగటులో 96 శాతం ఉండవచ్చని భూశాస్త్ర శాఖ కార్యదర్శి ఎం రవిచంద్రన్ తెలిపారు. రుతుపవనాలపై ఆధారపడి ఎక్కువగా వ్యవసాయం చేసే భారత్కు ఐఎండీ అంచనాలు కాస్త ఉపశమనం కలిగించాయి.
రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు 39 నుంచి 44 డిగ్రీల మధ్య, జీహెచ్ఎంసీ పరిధిలో 37 నుంచి 39 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నది. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ముత్తారంలో 43.9 డిగ్రీలు, హైదరాబాద్లోని గచ్చిబౌలిలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. 29, 30 తేదీల్లో రాష్ట్రంలో తేలికపా టి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం తెలిపింది.