హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోకి ఈసారి నైరుతి రుతుపవనాలు 5 రోజులు ఆలస్యంగా వచ్చినప్పటికీ ఘనంగానే ఎంట్రీ ఇచ్చాయి. వీటి ఆగమనంతో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో అన్ని జిల్లాల్లో వానలు కురిశాయి. రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నల్లగొండ, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా సంగంలో 16, మహబూబ్నగర్ జిల్లా ఉదిత్యాలలో 15.63, నాగర్కర్నూల్ జిల్లా తోటపల్లిలో 13.63, రంగారెడ్డి జిల్లా కందుకూరులో 13.13, ఆమనగల్లో 12.68, వనపర్తిలో 12.53, రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 11.58, నాగర్కర్నూల్ జిల్లా యనగంపల్లిలో 11.35, మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో 10.30 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. గత రెండు రోజుల నుంచి దాదాపు అన్ని జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలను సిద్ధం చేసుకొని వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు మరాఠ్వాడ, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలతోపాటు కర్ణాటక అంతటా విస్తరించాయి. ఇవి ఉత్తర పరిమితిలో డయ్యూ, నందుర్బార్, జల్గావ్, పర్బని, రెంటచింతల, మచిలీపట్నం మీదుగా పయనిస్తున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు బీహార్ నుంచి తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతున్నట్టు తెలిపింది. దీంతో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనా లు విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడినట్టు వివరించింది. రానున్న రెండు రోజుల్లో పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.