హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో/అంబర్పేట/విద్యానగర్, జూలై 24 (నమస్తే తెలంగాణ): కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన ఇద్దరు దంపతుల్లో మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. దీంతో వారిద్దరిని హైదరాబాద్లోని ఫీవర్ దవాఖానకు తరలించారు. వారికి ప్రత్యేక వార్డులో చికిత్స చేస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. బాధితుల్లో ఒకరు ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చారని, ఆయనకు 20న జ్వరం, 23 తేదీ నాటికి దద్దుర్లు రావడంతో చికిత్స కోసం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు దవాఖానకు వెళ్లాడని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ జీ శ్రీనివాసరావు తెలిపారు.
అక్కడి వైద్యుడు మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో తొలుత జిల్లా దవాఖానకు, అక్కడి నుంచి ఫీవర్ దవాఖానకు తరలించినట్టు వివరించారు. బాధితుడి నుంచి రక్త నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ఇన్స్టిట్యూట్ ల్యాబ్కు పంపనున్నామని, ఫలితాలు వచ్చేంతవరకు ఆయనను ఫీవర్ దవాఖానలోనే ఐసోలేషన్లో ఉంచనున్నామని తెలిపారు. ఆ వ్యక్తితో కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించామని, వారిలో ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ ఆరుగురిని కూడా ఐసొలేషన్లో ఉంచినట్టు చెప్పారు. రాష్ట్ర వైద్యశాఖ మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారని, ఆయన సూచనలకు అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతున్నామని వివరించారు. మంకీపాక్స్ ప్రాణాంతక వ్యాధి కాదని, దీని గురించి ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు.