Jagadish Reddy | ఈనెల 29న నిర్వహించనున్న దీక్ష దివాస్ను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా ముఖ్యనేతలతో సన్నాహక సమావేశ నిర్వహించిన అనంతరం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో.. అన్న నినాదమే ఉద్యమానికి ఊపిరి పోసిందని గుర్తుచేశారు. రాష్ట్ర ఏర్పాటు సాధనలో ఆరోజే కీలకమని పేర్కొన్నారు.
కేసీఆర్ ఆమరణ దీక్షతోనే కేంద్ర మెడలు వంచిండని జగదీశ్ రెడ్డి అన్నారు. ఆ దీక్షతోటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు. ఉద్యమం ఉవ్వెత్తున లేచి.. అన్ని రంగాలు ఐక్యతతో కలిసి వచ్చినాయన్నారు. అందుకే ఆరోజు ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి దీక్షదివాస్కు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. రాష్టానికే ఆదర్శంగా సూర్యాపేటలో దీక్షదివాస్ ను నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు..
కేవలం డబ్బు సంపాదనే రేవంత్ లక్ష్యమని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. అందుకే పెద్ద ఎత్తున భూ కుంభకోణాలకు పాల్పడుతున్నాడని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తుందని తెలిపారు. ఇండస్ట్రియల్ కార్పొరేషన్ కు కేటాయించిన భూముల్లో ప్రభుత్వ మోసం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. కోకాపేటలో ఎకరం 100 నుంచి 170 కోట్లు వేలంలో విక్రయించినట్లు చెబుతున్న ప్రభుత్వం.. ఇప్పుడు అదే ప్రాంతంలో అతి తక్కువ ధరకు విక్రయించడంలో అర్థమేంటి అని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకోవడంపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందని జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ భూముల కుంభకోణంపై వచ్చే ప్రభుత్వంలో విచారణ తప్పదని హెచ్చరించారు. ప్రజల ప్రభుత్వ ఆస్తులను దోచుకున్న వారు ఎవరైనా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. భూ కుంభకోణంలో సహకరించిన వాళ్లంతా జైలుకు వెళ్లక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
ధాన్యం కొనుగోలులో చాలా గోల్ మాల్ జరుగుతుందని జగదీశ్ రెడ్డి అన్నారు. ఐకేపీ సెంటర్లలో సరిగ్గా ధాన్యం కొనడం లేదని తెలిపారు. మ్యాచర్ వస్తలేదని రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. దళారుల చేతుల్లో రైతులు తీవ్రంగా మోసపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ 2014 ముందున్న సమస్యలే తలెత్తుతున్నాయని అన్నారు. బీసీలను పెద్ద ఎత్తున మోసం చేసిన పార్టీ కూడా కాంగ్రెస్సే అని జగదీశ్ రెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ హామీ ఇచ్చి విస్మరించిందని అన్నారు. తెలిసే మోసం చేసి.. తప్పించుకునేందుకు సాకులు వెతుకుతుందని అన్నారు. కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడిన చందంగా ఉంది బీసీల పరిస్థితి అని విమర్శించారు. BC రిజర్వేషన్లు పెంచుతామని ఉన్న రిజర్వేషన్లు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. అందుకు అనేక చోట్ల BC లకు జీరో రిజర్వేషన్లు రావడమే నిదర్శనమని అన్నారు.
బీసీల కోసం బీఆర్ఎస్ ఉద్యమిస్తదని జగదీశ్ రెడ్డి అన్నారు. బీసీలతో పాటు అన్ని రంగాల ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరిగిందని తెలిపారు. కేసీఆర్ ని వదులుకున్నామన్న భావన అందరిలో కలుగుతుందని అన్నారు. స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ విజయకేతనం తప్పదని స్పష్టం చేశారు.