ఉస్మానియా యూనివర్సిటీ, మే 15: రాష్ట్రంలో సంస్కృత యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత విభాగం సంతోషం వ్యక్తం చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. 2009లో కొల్చారంలో సంస్కృత సాహిత్య సదస్సులు నిర్వహించారని, అప్పటి మంత్రులు సంస్కృత వర్సిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
కానీ, అది హామీల వరకు మాత్రమే పరిమితమైందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని సాహిత్యంపై ఉన్న మక్కువతో మహాకవి మల్లినాథసూరి పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంస్కృతం అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
కొల్చారంలో స్థల పరిశీలన
కొల్చారం, మే 15: మెదక్ జిల్లా కొల్చారంలో కోలాచల మల్లినాథసూరి సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు స్థానికంగా రెండు చోట్ల స్థలాలను ఎంపిక చేసి సర్వే నంబర్లు, రైతుల వివరాలను సిద్ధం చేశారు. ఈ మేరకు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవారం సదరు స్థలాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ రాజర్షిషా, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు కేవీ రమణాచారితో ఫోన్లో మాట్లాడి రెండు చోట్ల స్థలాన్ని పరిశీలించినట్టు తెలిపారు.