హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో కుటుంబ పాలన అంటూ పదేపదే గొంతు చించుకునే బీజేపీ నేతలే ముక్కున వేలేసుకొనేలా పరేడ్ గ్రౌండ్ చుట్టూ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. బీజేపీ ముఖ్య నేతలు, కేంద్రంలోని మంత్రులు వారి తనయులతో పాటు అవినీతికి పాల్పడిన బడా వ్యాపారవేత్తల తండ్రులు-తనయులతో కూడిన వారసత్వ కుటుంబ పాలనకు కేరాఫ్ అడ్రస్గా ఉన్న కాషాయ పార్టీ రాజకీయాలను బట్టబయలు చేసింది. దేశమంతటా అవినీతిని విస్తురిస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనంటూ పలు ఫ్లెక్సీలు వెలిశాయి.
నివారం పరేడ్గ్రౌండ్లో జరిగిన ప్రధాని నమోదీ సభకు ఆ ఫ్లెక్సీలే స్వాగతం పలికాయి. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతున్నదని ప్రతినిత్యం వల్లించే బీజేపీ నాయకులు తమ పార్టీ గురించి మొదట ఆలోచించుకోవాలని, వారసత్వ రాజకీయాలను అత్యంత వేగంగా ప్రోత్సహిస్తున్నది నరేంద్ర మోదీ పరివారమేనని ఎద్దేవా చేస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. వివిధ స్కాములతో సంబంధమున్న పలు విషయాలు దేశ పటంలోని రాష్ర్టాల వారీగా పేర్కొంటూ భారీ ఫ్లెక్సీ ఒకటి వెలిసింది. దీంతోపాటు ‘పరివార్ వెల్కమ్స్ యూ మోదీ జీ’ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలో బీజేపీలో ఉన్న వారసత్వ జాడ్యాన్ని బయటపెట్టింది. బీజేపీ పాలనలో ప్రతి రాష్ట్రం ఏదో ఒక రూపంలో బాధిత ప్రాంతంగానే మిగిలిందని, అనేక ప్రభుత్వాలను కూల్చి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఘనత మోదీ పరివారానికే దక్కిందని తెలిపే వివరాలు ఆ ఫ్లెక్సీలో ఉన్నాయి. ప్రధాని మోదీ సభకు వచ్చిన ప్రజలందరినీ ఆ ఫ్లెక్సీలు ఆలోచింపజేశాయి.