Delimitation | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): లోక్సభ స్థానాల పునర్విభజన విధానం లోపభూయిష్టంగా ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. పార్లమెంటు స్థానాల పెంపునకు జనాభాను మాత్రమే ప్రామాణికంగా తీసుకొంటే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. దక్షిణాదిలోని అన్ని రాష్ర్టాల్లో పెరిగే సీట్లకంటే ఎక్కువ ఒక్క ఉత్తరప్రదేశ్లోనే పెరుగుతాయని తెలిపారు.
జనాభా నియంత్రణతోపాటు దేశ ఆర్థిక రంగానికి మూల స్తంభంగా నిలిచిన దక్షిణాది రాష్ర్టాలకు పార్లమెంటు స్థానాల పునర్విభజనలో తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నదని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘భవిష్యత్తులో పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుందని, అందుకే కొత్త పార్లమెంట్ భవనం నిర్మించామని ప్రధాని మోదీ చెప్పారు. ఏ ప్రాతిపదికన ఎంపీల సంఖ్య పెంచుతారో మాత్రం కేంద్రానికి నేటికీ స్పష్టత లేదు. దక్షిణ భారతదేశంలో జనాభా నియంత్రణ పాటించాం. ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగాం. ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్తోపాటు మరికొన్ని రాష్ర్టాలు జనాభా నియంత్రణను గాలికొదిలేశాయి.
ఆర్థికంగా దేశానికి మరింత భారంగా మారుతున్నాయి. దేశ ఆర్థిక రంగానికి మూలస్తంభంగా నిలుస్తున్న దక్షిణాది రాష్ర్టాలకు ప్రాధాన్యం తగ్గించి, భారంగా మారిన యూపీ వంటి రాష్ర్టాలను అందలం ఎక్కిస్తామనటం ఎంతవరకు సబబు? దక్షిణాది మొత్తానికి పెరగనున్న సీట్ల కంటే ఎక్కువ ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికే పెరగడం ఎలా న్యాయమవుతుంది? నాకు దక్షిణ భారతం, ఉత్తర భారతం అనే వ్యత్యాసమేమీ లేదు. కానీ.. ఉత్తమంగా పనిచేసిన రాష్ర్టాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అందరికీ సమ న్యాయం దక్కాలి. కానీ దేశంలో ఆ పరిస్థితి లేదు. అమెరికాలో 50 రాష్ర్టాలుంటే ప్రతి రాష్ర్టానికి ఇద్దరు సెనేటర్లు ఉంటారు.
మెయిన్ అనే చిన్న రాష్ట్రం, అలాసికల్ అనే పెద్ద రాష్ట్రం ఉన్నాయి. విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆ రెండు రాష్ర్టాలకు ఇద్దరు చొప్పున ఉంటారు. అందరికీ సమ ప్రాధాన్యం ఉండాలనే సదుద్దేశంతో అక్కడ ప్రతి రాష్ర్టానికి ఇద్దరే సెనేటర్ల సంప్రదాయం పెట్టారు. అలాగని ప్రపంచంలో అమెరికన్ మాడల్ అద్భుతమని నేను చెప్పడంలేదు. కానీ.. అలాంటి కొత్త ఆలోచనలు చేస్తే బాగుంటుంది. ఒక్కో దేశంలో ఒక్కోరకమైన ప్రజాస్వామ్యం ఉంటుంది. మన దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రకారం ఏ రాష్ర్టాలకు ఏది దక్కాలి? ఎంత దక్కాలి? ఎటువంటి న్యాయం జరగాలి? అనేదానిని పాలకులు పాటించడంలేదు. దేశంలో నాకంటే పెద్దవాళ్లు, మేధావులు చాలామంది ఉన్నారు. వాళ్లందరూ ఆలోచించాలి. స్వరం వినిపించాలి’ అని కోరారు
దేశంలో దక్షిణ భారతదేశం జనాభా 18 శాతమే అయినా, జీడీపీలో వాటా మాత్రం 36 శాతమని మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశానికి ఆర్థిక చేయూతనిస్తున్న దక్షిణాది గొంతు నులిమేసే కుట్ర జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రతిరాష్ట్రం ఒకే విధమైన ప్రగతిని సాధించలేదని, అలాంటప్పుడు ఆ రాష్ర్టాలను సరైన మార్గంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రధానిగా మోదీకి లేదా? అని నిలదీశారు. ‘వెనుకబడిన రాష్ర్టాలను గాలికొదిలెయ్యాలని మేమెప్పుడూ చెప్పలేదు. ఉత్తరాదిన కొన్ని రాష్ర్టాల్లోని ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా ఇస్తే ఎందుకిచ్చారని ఏమెప్పుడూ ప్రశ్నించలేదు. మాక్కూడా ఇవ్వాలని అడుగుతున్నాం. జనాభాను పెంచి ప్రణాళిక, క్రమశిక్షణ లేకుండా దేశానికి గుదిబండలా మారిన వాళ్లను నెత్తికెత్తుకొంటామంటే చూస్తూ ఎలా సహించాలి? ఎవరైనా మన గొంతు నొక్కేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? గొంతు విప్పకుండా ఉంటామా? అని ప్రశ్నించారు.
యూపీ జనాభా ఎక్కువ కాబట్టి, వాళ్లకు ఎక్కువ సీట్లు కేటాయిస్తామనే వాదన సరికాదని తేల్చి చెప్పారు. డీ లిమిటేషన్పై పార్లమెంట్లో చర్చ జరగాలని, అక్కడే హేతుబద్ధంగా ఆలోచించాలని కోరారు. అలా ఆలోచించకపోతే ఏం చేయాలో తమకు తెలుసని స్పష్టంచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో ఎన్నోసార్లు సవరణలు చేశారని, కానీ దేశానికి మంచి జరుగుతుందని చెబితే మాత్రం సవరణలు చేయడం కుదరదని చెప్తారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘2026లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉన్నది. 2024లో ఎన్నికలున్నాయి. బీజేపీ అధికారంలోకి రాదు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండరు. పునర్విభజన గురించి పార్టీలు ఆలోచిస్తాయి. మెరుగైన విధానాలపై చర్చ అవసరం’ అన్నారు.