హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడువనున్న వందేభారత్ రైలును సంక్రాంతి రోజున ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 15న ఉదయం 10 గంటలకు వర్చువల్గా జెండా ఊపి రైలును ప్రారంభిస్తారని బీజేపీ వర్గాలు గురువారం వెల్లడించాయి. వందేభారత్ సిరీస్ రైళ్లలో ఇది ఎనిమిదోది. ఈ రైలు వరంగల్ వరకు వెళ్లి వస్తుంది. సికింద్రాబాద్లో జరిగే కార్యక్రమంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొననున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన తర్వాత ట్రైల్ రన్గా అక్కడి నుంచి వరంగల్కు బయలుదేరుతుందని రైలు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు వెల్లడించారు. తిరిగి వరంగల్ నుంచి సికింద్రాబాద్కు చేరుకుంటుందని చెప్పారు. కాగా, వందే భారత్ రైలును ఈ నెల 19న సికింద్రాబాద్లో ప్రధాని ప్రారంభించాల్సి ఉండగా, వాయిదా పడింది.
రాళ్ల దాడి నిందితుల అరెస్ట్
వందే భారత్ ట్రైన్పై బుధవారం రాళ్ల దాడికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రైన్ తయారైన చెన్నై కోచ్ ఫ్యాక్టరీ నుంచి ట్రయల్ రన్లో భాగంగా వైజాగ్కు చేరుకుంటున్న సమయంలో కంచెరపాలెం రామ్మూర్తి పంతులు గేట్ వద్ద రాళ్లతో దాడి చేశారు. దీంతో 11, 14వ కోచ్ల అద్దాలు పగిలాయి. రైల్వే, స్థానిక పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించారు. శంకర్, దిలీప్, చందు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకొని, విచారిస్తున్నారు. కాగా, ధ్వంసమైన అద్దాల స్థానంలో రైల్వే సిబ్బంది గురువారం మరమ్మతులను చేసి కొత్త అద్దాలను అమర్చారు.