నమస్తేతెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 11: ‘నేడు ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉన్నడు. కన్న కొడుకోలే కంటి అద్దాలు పెట్టించిండు. పెద్ద కొడుకోలే ఆసరా పింఛన్ ఇస్తున్నడు. మేనమామ వలె కల్యాణలక్ష్మి ఇచ్చిండు. పెద్దన్నలాగా రైతాంగానికి రైతుబంధు పంపుతున్నడు’ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇంత చేసిన సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ, బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విషం కక్కుతున్నారని మండిపడ్డారు.
మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల, ముత్తారం గ్రామాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్ కోటిరెడ్డి, ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉష ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దంపతులు మహిళలతో కలిసి నృత్యం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ను బద్నాం చేసే పనిలో బీజేపీ ఉండగా, దానికి కాంగ్రెస్ పార్టీ వంతపాడుతున్నదని మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు, కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసే దిశగా కేంద్రం చర్యలు చేపట్టిందని ఆరోపించారు. కాగా హనుమకొండ జిల్లా ఐనవోలులో నిర్వహించిన సమ్మేళనంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, జడ్పీ చైర్మన్ సుధీర్బాబుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు.
పార్లమెంట్కు అంబేద్కర్ పేరు పెట్టాలి
ఢిల్లీలో కొత్తగా కడుతున్న పార్లమెంట్ భవనానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నిర్మల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. మోదీ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో పూర్తిగా విఫలమైందని అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నల కడుపు కొట్టింది మోదీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు.
కేంద్రం కుట్రలను ఛేదిస్తూ అభివృద్ధి
అసత్య ఆరోపణలను పట్టించుకోవద్దు
సమ్మేళనంలో ఎమ్మెల్సీ చల్లా సూచన
ప్రజాసంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని చిన్నంబావి మండల కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చల్లా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. దీన్ని గుర్తించిన ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్తోపాటు ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చలు
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): భారత రాష్ట్ర సమితి 22వ ఆవిర్భావ దినోత్సవాలలో భాగంగా ఈ నెల 25న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్లలో నియోజకవర్గ స్థాయి పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ నిర్ణయించారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని వార్డులు, డివిజన్లలో ఉదయమే పండుగ వాతావరణంలో పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు. అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే ప్రతినిధుల సభకు హాజరుకావాలని పార్టీ శ్రేణులను కోరారు. ఆ రోజంతా జరుగనున్న పార్టీ నియోజకవర్గ ప్రతినిధుల సభలో.. పార్టీ ఆధ్వర్యంలో సాధించిన రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ, రాజకీయ పరిస్థితులు, ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ తరఫున చేపట్టిన కార్యక్రమాలన్నింటిపై విసృ్తతంగా చర్చించనున్నట్టు తెలిపారు.
27న భవన్లో ఆవిర్భావ దినోత్సవం
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించనున్నట్టు కేటీఅర్ తెలిపారు. తెలంగాణ భవన్లో జరుగనున్న పార్టీ సర్వసభ్య సమావేశానికి పార్టీ అధ్యక్షుదు కే చంద్రశేఖర రావు అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ జెండాను ఎగరవేస్తారని తెలిపారు. ఈ సమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి, విసృ్తతంగా చర్చించి, వాటిని ఆమోదించుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనాలను మే నెలాఖరు వరకు నిర్వహించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. పార్టీ 23వ యేట అడుగుపెడుతున్న సందర్భంగా, రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై చర్చ జరుగుతుందని తెలిపారు.