హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): రైతుల సమస్యలు పట్టని ప్రధాని మోదీ తన కార్పొరేట్ మిత్రులకు మాత్రం దేశాన్ని దోచిపెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం దిగ్విజయ్సింగ్ ఆరోపించారు. రైతులకు కనీసం నిరసన తెలియజేసే అవకాశం కూడా లేకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గాంధీభవన్లో గురువారం ఆయన బీజేపీ సర్కార్పై ‘దస్ సాల్.. అన్యాయ్కాల్’ పేరుతో రూపొందించిన డాక్యుమెంట్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాసు మున్షీతో కలిసి మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలో బీజేపీ హయాంలో పదేండ్లుగా దేశానికి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా జరిగిన అన్యాయాలను తమ డాక్యుమెంట్లో పొందుపరిచామని చెప్పారు. మోదీ తన హయాంలో మొత్తంగా కార్పొరేట్లకు కొమ్ముకాసే పనులే చేశారని ధ్వజమెత్తారు. మోదీ సర్కార్ ఎన్నడూ రైతులు గురించి ఆలోచించలేదని అన్నారు. కర్ణాటక, తెలంగాణలో తమ పార్టీ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే, ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు కాగితాలకే పరిమితం అయ్యాయని విమర్శించారు.