హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ భయపడుతున్నదని, ఆయనను తెలంగాణకే పరిమితం చేసేందుకు కుట్రలు పన్నుతున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఒక వ్యక్తి స్వార్ధంతోపాటు బీజేపీ రాజకీయ కుట్రలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని చెప్పారు. మునుగోడులో టీఆర్ఎస్సే గెలుస్తుందని, వివిధ సర్వేలు 14-18 శాతం ఆధిక్యత చూపిస్తున్నాయని వివరించారు. శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ల కోసమే అమ్ముడుపోయి, బీజేపీలో చేరి ఉపఎన్నిక తెచ్చిన రాజగోపాల్రెడ్డిని ఓడించాలని, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. జగదీశ్రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..
కాంగ్రెస్ నుంచి ఒక కుటుంబాన్ని బీజేపీ కొన్నది. అమ్ముడుపోయినాయనే నిస్సిగ్గుగా ఒప్పుకొన్నారు. మూడేండ్ల నుంచి బీజేపీతో టచ్లో ఉన్నానని, మూడు నెలల క్రితమే రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ వచ్చిందని చెప్పుకొని ఆయనే బద్నాం అయ్యారు. బలహీనపడ్డారు. అతి అహంకారం, రాజకీయ దుర్బుద్ధి, స్వార్థంతోనే ఉప ఎన్నికను తీసుకొచ్చిండ్రు. ఈ అవినీతి కోవర్ట్ రాజకీయాలను నల్లగొండ జిల్లా ప్రజలు సహించరు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి కోవర్ట్ల పనిపట్టడం జిల్లా ప్రజలకు తెలుసు. ఇప్పుడు మునుగోడు ప్రజలు సైతం ఈ కోవర్ట్ పనిపడుతరు.
ముమ్మాటికీ మునుగోడులో గెలుపు మాదే. యువత, కొత్త ఓటర్లు మా వైపే ఉన్నారు. ఇదే విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. మేం 14నుంచి 18శాతంతో ముందంజలో ఉన్నాం. మొన్నటివరకు మునుగోడులో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ రెండోస్థానం కోసం కొట్లాడుకొంటున్నాయి. బీజేపీని నిలువరించాలన్న అభిమతంతోనే వామపక్షాలు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాయి. ఈ కలయిక జాతీయస్థాయిలోనూ కొనసాగుతుంది.
తనవల్లే కేసీఆర్ మునుగోడుకు వచ్చారని రాజ్గోపాల్రెడ్డి చెప్పుకోవడం అర్థం పర్థం లేని మాటలు. ఉద్యమ సమయంలోనే కేసీఆర్ మునుగోడులో పల్లెనిద్ర చేశారు. ఆరోజు రాజగోపాల్రెడ్డి రాజకీయాల్లోనే లేరు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా పథకాలను ఏ ఎన్నికలప్పుడు ప్రవేశపెట్టినం? బీజేపీలో చేరినాయన పిచ్చిపట్టి మాట్లాడుతున్నారు. ఎండ వస్తే.. తనవల్లే వచ్చిందని, వానపడితే.. తనవల్లనే వచ్చిందనే భ్రమలో ఆయన ఉన్నారు.
తమకు తెలంగాణ ప్రయోజనాలు ఎంత ముఖ్యమో.. హక్కులను కాపాడేందుకు తాము ఎంతగా తాపత్రయపడుతున్నామో తెలిపేందుకు కోర్టు కేసులే నిదర్శమని ఓ ప్రశ్నకు సమాధానంగా జగదీశ్రెడ్డి చెప్పారు. విద్యుత్తు ఉద్యోగుల విభజనలో సుప్రీంకోర్టుకు క్షమాపణలు, సీఎస్పై కోర్టు ధిక్కార కేసులు నమోదవడం మీ వైఫల్యం కాదా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇవి వైఫల్యాలు కావని, తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని చెప్పేందుకు ఈ కేసులే తార్కాణమని నొక్కిచెప్పారు. కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్నాయుడు, ప్రధాన కార్యదర్శి రవికాంత్రెడ్డి, క్లబ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతున్నది. మోదీ హవా తగ్గుతున్నది. ప్రజలకు చెప్పడానికి బీజేపీకి ఏమీలేదు. ఇదే సమయంలో తెలంగాణ పథకాల గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్నది. ప్రజలు సీఎం కేసీఆర్ గురించి చర్చించుకొంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ భయపడుతున్నది. కేసీఆర్ రూపంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కనిపిస్తున్నది. కేసీఆర్ను రాష్ట్రం దాటి జాతీయ రాజకీయాల్లోకి రాకుం డా కట్టడి చేయడం, తెలంగాణకే పరిమితం చేయడం, పచ్చని రాష్ట్రం మంటలు పెట్టడంలో భాగంగానే బీజేపీ కుట్రలు పన్నుతున్నది.
ఏడ్చేటోళ్ల గురించి ఏం మాట్లాడుతాం. రేవంత్రెడ్డిని కాంగ్రెస్ నేతలే పీసీసీ అధ్యక్షుడిగా వద్దంటున్నరు. ఆ పార్టీ నాయకులే ఆయన్ను అంగీకరించడం లేదు. కాంగ్రెస్ను ఇంకొకరు చంపాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ నేతలే సొంత పార్టీని చంపేందుకు సిద్ధంగా ఉన్నారు. రాహుల్గాంధీ యాత్రను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పార్టీనే జోడించలేని వాళ్లు దేశాన్ని ఎలా జోడిస్తారు.