హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పుట్టుకపైనే విషం చిమ్మిన మోదీ, ఏ ముఖం పెట్టుకొని రాష్ర్టానికి వస్తున్నారని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ఎనిమిదేండ్లలో తెలంగాణకు ఏంచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని ఒక్క హామీనైనా నేరవేర్చారా?అని ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ఎల్పీలో దయాకర్రావు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తూ దేశానికే మార్గదర్శిగా మారిందని, కేంద్రం ఏ అవార్డు ప్రకటించినా తెలంగాణయే తొలివరుసలో నిలుస్తున్నదని గుర్తుచేశారు. తెలంగాణ ప్రగతి పథం మోదీకి నచ్చడం లేదని, అందుకే ఏదో ఒక వంకతో నిధులు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణను అణచేస్తున్నానని, విభజన హామీలన్నీ తుంగలో తొక్కానని, నిధులివ్వకుండా వేధిస్తున్నానని.. తెలంగాణలో చెప్తారా? అని ప్రశ్నించారు. కరీంనగర్, ఆదిలాబాద్లో మెడికల్ కాలేజీలు కావాలని కోరామని, ఇవ్వకుండా ఏపీకి మాత్రమే ఇవ్వటం వివక్ష కాదా అని ప్రశ్నించారు. గిరిజన విశ్వవిద్యాలయం కోసం ములుగులో 400 ఎకరాలు సిద్ధం చేస్తే మంజూరు చేయలేదని.. ఏపీకి ఇస్తే అద్దె గదుల్లో గిరిజన విశ్వవిద్యాలయం నడుస్తున్నదని గుర్తుచేశారు.
కుంటి సాకులు.. ఉపాధికి తూట్లు
పేదల ఆకలి తీర్చే ఉపాధి హామీ పథకానికి రూ.70 వేల కోట్ల మేర కేంద్రం కోత విధించిందని ఎర్రబెల్లి ఆరోపించారు. రాష్ట్రంలో ఉపాధి పనుల్లో లోపాలు వెతకాలనే ఆదేశాలతో వచ్చిన 18 బృందాలకు ఏమీ దొరక్కపోవటంతో పనులకు అనుమతి తీసుకోకపోవటాన్ని నేరంగా చూపారని తెలిపారు. మొక లు నాటేందుకు కూడా కేంద్రం అనుమతి తీసుకోవాలా?అని ప్రశ్నించారు. ఈ సాకుతో ఉపాధి పథకంలో రూ.800 కోట్ల కోత విధించారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నడ్డి విరిచారని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలన్నీ రెండు, మూడు రెట్లు పెరిగాయని గుర్తుచేశారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ వీలుకాదని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చెప్తున్నారని, ఇదే ఉక్కు ఫ్యాక్టరీ కోసం కిషన్రెడ్డి ధర్నా చేసింది నిజం కాదా? అన్నారు.
తెలంగాణ ఛీకొట్టినా సిగ్గురాలేదా?
దేవుడి పేరుతో ఇంకెంతకాలం రాజకీయాలు చేస్తారని రాష్ట్ర బీజేపీ నేతలను ఎర్రబెల్లి ప్రశ్నించారు. ఎన్ని దొంగ ప్రమాణాలు చేసినా, మత విద్వేషాలు రెచ్చగొట్టినా.. ఒక్కసారైనా తెలంగాణలో పైచేయి సాధించారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఎర కేసుతో సంబంధం లేదంటున్న బీజేపీ, సిట్ విచారణపై హైకోర్టుకు ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. గవర్నర్ రాజకీయాలు చేయొద్దని ఆయన హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్, వీ గంగాధర్గౌడ్, యెగ్గె మల్లేశం, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి పాల్గొన్నారు.
మోదీజీ మీకు గుర్తుందా?
అయ్యా మోదీ గారు.. 2014లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏం చెప్పారో గుర్తుందా? గ్యాస్ సిలిండర్ ధర రూ.450 ఉన్నదని, ఇదెంతో అన్యాయమని తెగ బాధపడిపోయారు. అధికారంలోకి వస్తే సిలిండర్ ధర రూ.200 చేస్తామని హామీ ఇచ్చింది మీరు కాదా? మీకు గుర్తులేదా? పక్కనే నేను కూడా ఉన్నా. రేపు తెలంగాణకు వస్తున్నారు కదా? గుర్తొస్తదేమో ఆలోచించండి. గ్యాస్ సిలిండర్ ధరను రూ.1100కు పెంచారు?తెలంగాణ ఆడబిడ్డలు మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఏం జవాబు చెప్తారు? – మోదీకి మంత్రి ఎర్రబెల్లి ప్రశ్న