హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): మోదీ ప్రభుత్వం తన సహజమైన రైతు వ్యతిరేకతను, గ్రామీణ ప్రాంతంపై నిర్లక్ష్యాన్ని, పేదల పాలిట కక్షపూరిత వైఖరిని మరోసారి వెల్లడించుకున్నది. తాజా బడ్జెట్లో పేదల సంక్షేమానికి, పేదరిక నిర్మూలనకు, గ్రామాభ్యుదయానికి దారులు వేసే నిర్ణయాలేవీ తీసుకోలేదు. సన్నిహిత వ్యాపారులకు ఆస్తులను కట్టబెట్టే బీజేపీ సర్కారు పేద వర్గాలకు లబ్ధి చేకూర్చే అనేక పథకాలలో నిర్దాక్షిణ్యంగా కోత విధించింది. ప్రపంచ బ్యాంక్ ప్రశంసలు పొందిన, పల్లె పేదలకు కల్పతరువు వంటి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ పథకానికి గత ఏడాది కేటాయింపు 73 వేల కోట్లు కాగా, ఈ సారి లెక్క ప్రకారం 93 వేల కోట్లకు పెరగాలి. కానీ గతం కన్నా తక్కువగా 60 వేల కోట్లకు కేటాయింపు తగ్గింది.
ఉద్యమిస్తున్న రైతులపై వాహనాలు తొక్కించి చంపిన కేంద్రం తాజా బడ్జెట్లో వ్యవసాయ అనుబంధ రంగాలకు నిధులను భారీగా తగ్గించింది. పంటల బీమా, పీఎం కిసాన్, రాష్ట్రీయ కృషి వికాస్ తదితర పథకాలకు నిధులు తగ్గిపోయాయి. రైతులకు మద్దతు ధర అందించే పథకానికి నిధులలో కోత పడింది. పీఎం ఆశా పథకం రద్దయింది. ఆహారం, ఎరువులు, పెట్రోలియం మొదలైన రంగాలలో సబ్సిడీలపై కోత వేసింది. మొత్తం వ్యవసాయ, అనుబంధ రంగాలకు గత ఏడాది బడ్జెట్ కేటాయింపు రూ.1,51,521 కోట్లు ఉంటే ఈసారి మరింత పెరగాల్సింది. కానీ విచిత్రంగా రూ.1,44,214 కోట్లకు మోదీ సర్కారు తగ్గించి వేసింది.
మోదీ ప్రభుత్వం కనీసం పేద పిల్లలపై కూడా కరుణ చూపకుండా వారికి వర్తించే పథకాలకు 2.35 శాతం మేర నిధుల కోత విధించింది. కొన్నేండ్లుగా బాల కార్మికుల విముక్తికి కేటాయింపులను తగ్గిస్తూ ఉన్న సర్కారు ఇప్పుడు మరింతగా 33 శాతం తగ్గించింది. సర్కారు బడులకు డిజిటల్ లైబ్రరీ, ఇంటర్నెట్ సౌకర్యాలపై ఆసక్తి చూపలేదు. మొత్తంగా చూస్తే విద్య, వైద్య రంగాలను పేదల దగ్గరకు చేర్చే కేటాయింపులను విస్మరించింది.దేశంలో ద్రవ్యోల్బణం పెచ్చరిల్లుతుంటే, అదుపు చేయడానికి అనుసరించే విధానాలేవీ బడ్జెట్లో ప్రకటించలేదు.
నిరుద్యోగం పెరిగిపోతుంటే ఉపాధి కల్పన వ్యూహాలేమీ మోదీ దగ్గర లేవు. మౌలిక వసతుల రంగానికి కేటాయింపులను అట్టహాసంగా ప్రకటించినా, అవి ఏయే రంగాలకు, ఏయే రాష్ర్టాలకు చేరుతాయో, ఏయే వర్గాలకు లబ్ధిదాయకంగా మారుతాయో చెప్పలేని స్థితి. ఆర్థిక స్థిరీకరణ అంటూ అందమైన పదాలు పలుకుతూనే, దేశాన్ని అప్పుల ఊబిలోకి తోసేస్తున్నది. 15 లక్షల కోట్ల అప్పులు చేసి, అందులో పదకొండు లక్షలు పాత అప్పులు చెల్లించే దుస్థితికి దేశాన్ని దిగజార్చింది. ఆర్థిక వ్యవస్థను అనిశ్చితిలోకి నెట్టిన మోదీ సర్కారు, ఇప్పుడు మొత్తం దేశాన్ని సంక్షోభంలోకి నడిపిస్తున్నది.
తెలంగాణకు మొండిచేయి
దేశవ్యాప్తంగా పేదల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టిన మోదీ సర్కారు, తెలంగాణకు కూడా మొండి చెయ్యి చూపింది. బడ్జెట్లో బయ్యారం ఉక్కు ప్రస్తావనే లేదు. గుజరాత్లో గిఫ్ట్సిటీకి పన్నుల మినహాయింపును ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలోని ఏ ఆర్థిక మండలినీ కనికరించలేదు. టెక్స్టైల్ పార్క్కు నిధులు కేటాయించనే లేదు. గత ఏడాది 157 వైద్య కశాశాలలు ప్రకటిస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఆ వైద్యకళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలలు ప్రకటించినందున ఇవి కూడా దక్కడం లేదు.
ఎన్నికలు జరుగుతున్న కర్ణాటక రాష్ట్రంలో ఎగువ భద్ర ప్రాజెక్టుకు మూడున్నర వేల కోట్లు కేటాయించింది కానీ, ప్రపంచమంతా ప్రశంసిస్తున్న కాళేశ్వరానికి, మిషన్ భగీరథకు ఒక్క పైసా ఇవ్వలేదు. వరంగల్, నిజామాబాద్లో ప్రతిపాదించిన విమానాశ్రయాల విషయమై ఒక్క మాట చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతగా కోరినా చేనేత రంగానికి ఏ ప్రోత్సాహకమూ ప్రకటించలేదు. తెలంగాణ అస్తిత్వాన్నే అవమానించే మోదీ సర్కారుకు ఇక నిధులు, పథకాల కేటాయింపు ఆలోచన ఎక్కడొస్తుంది?