సెస్సు వసూళ్లు
2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.73,880 కోట్లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.2,96,884 కోట్లు
పెట్రోల్పై సెస్
2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.4,712 కోట్లు
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.25,895 కోట్లు
డీజిల్పై సెస్
2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.15,765 కోట్లు
2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.85,289 కోట్లు
హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ర్టాలను అస్థిరపరచడమే పనిగా పెట్టుకున్నారు. ఆర్థికంగా రాష్ర్టాలను బలహీనపరిచి వాటి అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు ఇవ్వాల్సిన వాటాను తగ్గిస్తున్నారు. సామాన్యులపై అదనపు పన్నులు మోపుతూ ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీస్తున్నారు. సెస్సుల రూపంలో సింహభాగం నిధులను కేంద్ర ఖజానాకు మళ్లించుకుపోతున్నారు. సెస్సుల పేరుతో మోదీ బాదుడు గత ఎనిమిదేండ్లలో ఏకంగా 4 రెట్లు పెరిగింది. 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22లో సెస్సుల మోత 18 శాతానికి ఎకబాకింది. ఈ విషయాన్ని స్వయంగా కేంద్రమే లోక్సభ సాక్షిగా అంగీకరించింది. 2013-14లో వచ్చిన మొత్తం రూ.10.14 లక్షల కోట్ల రాబడిలో సెస్సు 7.3 శాతంగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.16.33 లక్షల కోట్ల రాబడిలో సెస్సు 18.2 శాతంగా ఉన్నట్టు ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
పెట్రోల్పై 6 రెట్లు, డీజిల్పై ఐదున్నర రెట్లు
గత ఎనిమిదేండ్లలో మోదీ సర్కార్ పెట్రోల్, డీజిల్పై సెస్సులను అడ్డగోలుగా పెంచి రాష్ర్టాలకు తీరని అన్యాయం చేసింది. 2014-21 మధ్య కాలంలో పెట్రోల్పై సెస్సును 6 రెట్లు, డీజిల్పై ఐదున్నర రెట్లు పెంచింది. తద్వారా రాష్ర్టాల వాటాలను కాజేసి కేంద్ర ఖజానాకు తరలించుకుపోయింది. ఇటీవల కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.2.50, డీజిల్పై రూ.4 చొప్పున పన్ను తగ్గించినప్పటికీ ఆ మేరకు సెస్సును పెంచింది. దీంతో కేంద్రం కొత్తగా నిర్ణయించిన 41% వాటా ప్రకారం రాష్ర్టాలకు లీటర్ పెట్రోల్పై రూ.1.03, డీజిల్పై రూ.1.64 చొప్పున ఆదాయం తగ్గింది. ఇదేవిధంగా ఇతర పన్నుల నుంచి రాష్ర్టాలకు రావాల్సిన వాటాను కూడా కేంద్రం కొల్లగొడుతున్నది. 2017-2020 మధ్య కాలంలో కేంద్రం ఎక్సైజ్ పన్నులో పెట్రోల్పై సెస్, సర్ ఛార్జీలను 150%, డీజిల్పై 350% పెంచింది.
రోజూ రూ.813 కోట్ల దోపిడీ
సెస్సుల రూపంలో మోదీ సర్కార్ రోజూ సగటున రూ.813 కోట్లు దోచుకొంటున్నది. 2013-14 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.22,236 కోట్లుగా ఉన్న ప్రైమరీ ఎడ్యుకేషన్ సెస్సును 2020-21 నాటికి రూ.62 వేల కోట్లకు.. సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్సును రూ.11,266 కోట్ల నుంచి రూ.35,821 కోట్లకు పెంచింది. ఇదే సమయంలో పెట్రోల్పై సెస్సును రూ.4,712 కోట్ల నుంచి రూ.25,895 కోట్లకు.. డీజిల్పై సెస్సును రూ.15,765 కోట్ల నుంచి రూ.85,289 కోట్లకు పెంచింది. ఇలా అన్ని సెస్సులు కలిపి గత ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి అదనంగా రూ.2,96,884 కోట్ల ఆదాయం సమకూరింది. ఇదంతా రాష్ర్టాలకు పంగనామాలు పెట్టి తరలించుకుపోయిన సొమ్మే.
ప్రజలు చెల్లిస్తున్న అన్ని పన్నులకు అదనంగా కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ప్రత్యేక పన్నునే సెస్ అంటారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పెట్రోలియం, రహదారులు, మౌలిక సదుపాయాలు, ఎగుమతులు తదితర రంగాల్లో కేంద్రం సెస్ వసూలు చేస్తున్నది. సెస్సును ఏ రంగంలో వసూలు చేస్తే ఆ మొత్తాన్ని ఆ రంగం అభివృద్ధికే వెచ్చించాలి. ఇతర రంగాలకు బదిలీ చేయకూడదు. దీనికి భిన్నంగా మోదీ సర్కారు సెస్సుల రూపంలో వసూలు చేస్తున్న నిధులన్నీ పక్కదారి పట్టిస్తున్నది. పెట్రోల్, డీజిల్పై విధించిన సెస్తో చమురు పరిశ్రమలను అభివృద్ధి చేయడం లేదు. కేంద్రం విధించే సెస్సుల్లో రాష్ట్రాలకు వాటా ఉండదు. ఆ సొమ్మంతా కేంద్ర ఖాజానాకే చేరుతుంది. పన్నుల రూపంలో కేంద్రానికి వచ్చే రాబడిలోనే రాష్ర్టాలకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు నిధులు ఎగ్గొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం క్రమంగా సెస్సులను పెంచుతున్నది.