హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో నిరంతరాయంగా విరజిమ్ముతున్న విద్యుత్తు కాంతులను ఆర్పివేసేందుకు కేంద్రంలోని మోదీ సర్కారు విశ్వప్రయత్నాలు చేస్తున్నది. ప్రజలకు మంచి చేయాల్సిన ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేయరాదని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ), ఎనర్జీ ఎక్స్చేంజ్ సంస్థలను కేంద్ర విద్యుత్తు శాఖ ఆదేశించింది. ఎనర్జీ ఎక్స్చేంజ్ నిబంధనల ప్రకారం బిల్లు బకాయిలు చెల్లించని రాష్ర్టాలకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారు. కానీ తెలంగాణ విద్యుత్తు సంస్థలు కరెంటు ఉత్పత్తి సంస్థలకు ఇప్పటికే రూ.1,370 కోట్లు చెల్లించాయి. అయినా, తెలంగాణతోపాటు 12 రాష్ర్టాలకు ఎనర్జీ ఎక్స్చేంజ్ నుంచి గురువారం (18 తేదీ) అర్ధరాత్రి నుంచి విద్యుత్తు కొనుగోలు, అమ్మకాలు చేయడానికి అర్హత లేదని కేంద్రం ప్రకటించింది. విద్యుత్తు కొనుగోలు, అమ్మకాలకు ఎలాంటి అంతరాయం కలిగించరాదని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ మోదీ సర్కారు నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.
బీజేపీయేతర రాష్ర్టాలపైనే దాడి..
కేంద్రం నిషేధం విధించిన 13 రాష్ర్టాల్లో బీజేపీయేతర రాష్ర్టాలే అధికంగా ఉన్నాయి. బీజేపీ అధికారంలో లేని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, బీహార్ తదితర రాష్ర్టాలనే మోదీ సర్కారు ప్రధానంగా టార్గెట్ చేసింది. నిబంధనల ప్రకారం ప్రతినెలా 18 తేదీలోపు అంతకు ముందు నెలకు సంబంధించిన విద్యుత్తు కొనుగోళ్ల బిల్లులు చెల్లించాలి. చెల్లించకపోతే 19వ తేదీ నుంచి విద్యుత్తు కొనుగోలు, అమ్మకాలకు అనర్హులుగా ప్రకటిస్తారు. తెలంగాణ విద్యుత్తు సంస్థలు గత నెల కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటికే రూ.1,370 కోట్లు చెల్లించాయి. అయినా తెలంగాణ విద్యుత్తు కొనుగోలు చేయకుండా కేంద్రం నిషేధం విధించటం గమనార్హం. నిజానికి పీపీఏ ప్రకారం జనరేటర్లు, డిస్కంలకు మధ్య మూడో సంస్థ ప్రమేయానికి ఎలాంటి ఆస్కారం లేదు. అయితే విద్యుత్తు కొనుగోళ్లు, అమ్మకాలపై ఎన్ఎల్డీసీ పర్యవేక్షణ ఉండకూడదని, గ్రిడ్ డిసిప్లిన్కు మాత్రమే పరిమితమయ్యేలా ఆదేశాలివ్వాలని తెలంగాణ విద్యుత్తు సంస్థలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నా కేంద్ర విద్యుత్తు శాఖ, ఎన్ఎల్డీసీ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని కోర్టుకు విన్నవించాయి. దీంతో విద్యుత్తు కొనుగోలు సంస్థలపై అనర్హత వేటు వేయొద్దని హైకోర్టు స్టే ఇచ్చింది. అయినా కేంద్రం నిషేధం విధించటం గమనార్హం.
ప్రజలకు ఇబ్బంది రాకుండా చర్యలు
హైకోర్టు స్టే ఇచ్చి నా విద్యుత్తు ఎక్స్చేంజ్లో ఇబ్బందులు పెట్టడం సరికాదు. ఇప్పటికే రూ.1,370 కోట్ల బిల్లులు చెల్లించాం. కేంద్రం తీరుపై సోమవారం హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేస్తాం. రాష్ట్రంలో విద్యుత్తుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకొంటున్నాం. అందుబాటులో జల విద్యుత్తు ఉండటం మనకు కలిసి వచ్చేదే. ప్రజలు, వినియోగదారులు, విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వానికి సహకరించాలి.
– దేవులపల్లి ప్రభాకర్రావు, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ