మంచిర్యాల ఏసీసీ, మార్చి 18 : బీజేపీ ప్రభుత్వం సామాన్యుడిపై భారం మోపుతూ.. కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చుతున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర సర్కారు నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యులపై ఎనలేని భారం మోపుతున్నదని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థలకు మాత్రం రూ.12 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని, ఇది ముమ్మాటికీ కార్పొరేట్ల ప్రభుత్వమని ఆరోపించారు.
ఆర్ఎఫ్సీఎల్ జాతికి అంకితమని చెప్పి, సింగరేణి ప్రైవేటీకరించబోమని చెప్పి పెద్ద ఎత్తున గ్లోబల్ టెండర్లు ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిందని అన్నారు. బీజేపీ గవర్నర్ల చేత వేల కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రతిపక్షాలు లేకుండా చేస్తున్నదని మండిపడ్డారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతు లు లేకుండా బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు.