‘బయ్యారంలో స్టీల్ప్లాంట్ను ఏర్పాటు చేయడం కుదరదు. కేంద్రానికి సాధ్యంకానప్పుడు ఎలా ముందుకెళ్లగలం?’.. సోమవారం మీడియా సమావేశంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి వ్యాఖ్యలివి. ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి.. తెలంగాణలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు ముందుకురాని కేంద్రం.. కోట్లు విలువజేసే వైజాగ్ స్టీల్ప్లాంట్ను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మాత్రం ఉవ్విళ్లూరుతున్నది. సెయిల్ను (స్టీల్ అథారిటీ అఫ్ ఇండియా) కూడా తెగనమ్మడానికి కుట్రలు పన్నుతున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో-నమస్తే తెలంగాణ)
గత ఎనిమిదేండ్లలో వందకుపైగా ప్రభుత్వరంగ సంస్థల్లోని రూ.4 లక్షల కోట్ల విలువైన వాటాలను అమ్మేసిన కేంద్రంలోని మోదీ సర్కారు.. తన కార్పొరేట్ మిత్రులకు మరో భారీ సాయం చేసేందుకు సిద్ధమైంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇనుము, ఉక్కు రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఇదే అదునుగా దేశంలోని మెజారిటీ స్టీల్ప్లాంట్లను నిర్వహిస్తున్న సెయిల్ సంస్థను కార్పొరేట్లకు ధారాదత్తం చేసేందుకు చర్యలు ముమ్మరం చేస్తున్నది. ఈ క్రమంలో తొలుత వైజాగ్ స్టీల్ప్లాంట్ను అమ్మేందుకు సిద్ధమవుతున్నది. దీనికోసం లేనిపోని నష్టాలను కంపెనీకి అంటగట్టే కుట్రకు తెరతీసింది.
ఇప్పుడే ఎందుకంటే?
బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను అడ్డికి పావుశేరుకు అమ్మేస్తున్నది. ఎయిరిండియా, హెచ్జెడ్ఎల్, పవన్హన్స్, కోల్ ఇండియా, ఆర్ఈసీ, హెచ్పీసీఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, ఇండియన్ ఆయిల్, ఎన్టీపీసీ, ఎన్ఎండీసీ, జీఐసీ.. ఇలా 25కు పైగా రంగాల్లో 100కు పైగా ప్రముఖ కంపెనీలను ప్రైవేటుపరం చేసిన మోదీ సర్కారు కన్ను ఇప్పుడు ఇనుము, ఉక్కురంగంపై పడింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇనుము, ఉక్కు రేట్లు 40 శాతం వరకు పెరిగాయి. దీంతో ఇప్పటికిప్పుడు ఈ పరిశ్రమలను ప్రైవేటుపరం చేస్తే.. తన కార్పొరేట్ మిత్రులకు పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూర్చవచ్చని మోదీ సర్కారు భావిస్తున్నది.
వైజాగ్ ప్లాంట్పై అదానీ కన్ను
ఏసీసీ, అంబుజా సిమెంట్స్ కొనుగోలు ద్వారా సిమెంట్ రంగంలోకి ఇటీవలే ప్రవేశించిన అదానీ గ్రూప్.. వైజాగ్ స్టీల్ప్లాంట్ను సొంతం చేసుకుని ఉక్కు తయారీలోకీ అడుగుపెట్టాలని భావిస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగవ్ు లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్-వైజాగ్ స్టీల్ప్లాంట్)లో 100 శాతం వాటాను అమ్మేయాలని మోదీ సర్కారు గతంలో నిర్ణయించింది. ఈక్రమంలో ఈ ఏడాది చివర్లో జరిగే బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనాలని అదానీ గ్రూప్ ఉవ్విళ్లూరుతున్నట్టు సమాచారం. వైజాగ్ స్టీల్ప్లాంట్పై అదానీ గ్రూప్ ఆసక్తి కనబర్చడానికి మరో కారణం కూడా ఉన్నది. ఈ ప్లాంట్ దగ్గర్లోనే ఉన్న గంగవరం పోర్టును అదానీ గ్రూపే నిర్వహిస్తున్నది. ఇక వైజాగ్ స్టీల్ప్లాంట్ను కూడా చేజిక్కించుకొంటే అదానీకి బాగా కలిసి వస్తుందని మార్కెట్ వర్గాలంటున్నాయి. ప్లాంటులో స్టీల్ తయారీకి అవసరమైన బొగ్గు, ముడి ఇనుమును ఆసియా దేశాల నుంచి గంగవరం పోర్టు ద్వారా చౌకగా దిగుమతి చేసుకోవచ్చు. ప్లాంట్లో తయారైన స్టీల్, దాని ఉత్పత్తులను పోర్టు ద్వారా ఆగ్నేయాసియా దేశాలకు సులభంగా ఎగుమతి చేయవచ్చు.
లాభాల్లో ఉన్నప్పటికీ.. నష్టాల్లో ఉన్నట్టు..
దేశంలోనే రెండో అతిపెద్ద స్టీల్ ఉత్పత్తిదారైన సెయిల్లో ప్రభుత్వానికి 65% వాటా ఉన్నది. రూ.70 వేల కోట్ల టర్నోవర్తో లాభాలు ఆర్జిస్తున్న ఈ సంస్థ కింద భిలాయ్, రూర్కెలా, దుర్గాపూర్, బొకారో, అసన్సోల్ ఐదు ఇంటిగ్రేటెడ్ ఉక్కు కర్మాగారాలు, మరో మూడు ప్రత్యేక స్టీల్ ప్లాంట్లు, ఇంకో ఇనుము మిశ్రమ ప్లాంట్ ఉన్నది. ఇటీవల ఉక్కు ధరలు పెరగటంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో సెయిల్ రూ. 3,850 కోట్ల లాభాలు ఆర్జించింది. 2021-22లో వైజాగ్ స్టీల్ప్లాంట్ రూ. 835 కోట్ల నికర లాభాన్ని అర్జించింది. అయితే, ఈ రెండూ నష్టాల్లో ఉన్నాయని, అందుకే అమ్మేయాలని చూస్తున్నామని బీజేపీ నేతలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. వైజాగ్ స్టీల్కు వేల ఎకరాల భూమి ఉన్నది. ఈ భూములను ఓ ప్రత్యేక సంస్థలోకి మార్చి మరింత సొమ్ము చేసుకోవాలనీ బీజేపీ సర్కారు యోచిస్తున్నట్టు సమాచారం.