Mega Textile Park | తెలంగాణలో మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రకటించి రెండు నెలలైనా కాలేదు. ప్రధానమంత్రి మోదీ వచ్చి హైదరాబాద్ గడ్డపై దానిని ధృవీకరించి నాలుగు రోజులైనా గడవలేదు. అంతలోనే కేంద్రం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు మంగళం పాడేసినట్టు తెలుస్తున్నది. అదే జరిగితే, తెలంగాణ విషయంలో కేంద్రం మరోమారు దగా చేసినట్టే..!
హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుచేస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారీ చెప్తున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం అడగ్గా.. అడగ్గా ఎట్టకేలకు ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు టెక్స్టైల్స్ పార్కును మంజూరుచేస్తున్నట్టు చెప్పారు. ఇంతలోనే.. బీజేపీ సర్కారు మళ్లీ మొదటికి వచ్చింది. పీఎం మిత్ర పథకంలో భాగంగా తెలంగాణకు మంజూరు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)కి మంగళం పాడినట్టు తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టు తమ మార్గదర్శకాలకు అనుగుణంగా లేదంటూ కేంద్రం అధికారులు కొర్రీలు వేసి పక్కకు పెట్టారు. ఇటీవల కేంద్ర టెక్స్టైల్ మంత్రిత్వశాఖ కార్యదర్శి రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా మాట్లాడుతూ, వరంగల్లో ఏర్పాటుచేసిన కేఎంటీపీ పీఎం మిత్ర మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని చెప్పారు.
ప్రస్తుత బడ్జెట్లో మంజూరు చేసిన ఈ ప్రాజెక్టుపై సాక్షాత్తూ ప్రధానమంత్రి సైతం రెండుసార్లు బహిరంగ సభల్లో ప్రకటించినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లా శాయంపేట గ్రామం వద్ద కేఎంటీపీకి 2017అక్టోబర్లో శ్రీకారం చుట్టింది. సుమారు 1,200 ఎకరాల్లో దీన్ని అభివృద్ధి చేశారు. సుమారు రూ.1,000 కోట్లతో అంతర్గత రోడ్లు, విద్యుత్తు సరఫరా తదితర మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. వ్యర్థాల శుద్ధి ప్లాంటుతోపాటు మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొరియాకు చెందిన యంగ్వన్ కార్పొరేషన్, చిన్న పిల్లల దుస్తుల తయారీలో ప్రసిద్ధిచెందిన కిటెక్స్, గణేషా ఎకోస్పేర్ తదితర సంస్థలతోపాటు పలు ఇతర కంపెనీలకు ఇప్పటికే స్థలాలను కేటాయించారు. అందులో గణేషా ఎకోస్పేర్ ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. మరో ఆరు నెలల్లో కిటెక్స్, యంగ్వన్ కూడా ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.
ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం కోసం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పిస్తున్నది. అనేకసార్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కూడా కేంద్రానికి లేఖలు రాశారు. కేంద్రం 2021-22లో వస్త్ర పరిశ్రమ కోసం ప్రత్యేకంగా మెగా ఇండస్ట్రియల్ పార్క్ల అభివృద్ధికి పీఎం మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. కనీసం ఈ పథకంలో అయినా కేఎంటీపీకి స్థానం కల్పించి నిధులివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో ఈ ఏడాది బడ్జెట్లో కేఎంటీపీకి పీఎం మిత్ర పథకాన్ని మంజూరు చేశారు. స్వయంగా ప్రధాని మోదీ సైతం ఇటీవల రెండుసార్లు నిర్వహించిన రాష్ట్ర పర్యటనలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయినా ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు వెలువడకపోగా, పరిశ్రమల శాఖకు సైతం ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.
పీఎం మిత్ర మార్గదర్శకాలు
పీఎం మిత్ర (మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్ అండ్ అప్పారెల్) పార్క్స్ స్కీమ్ కింద దేశంలో ఏడు టెక్స్టైల్ పార్క్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం విదితమే. ఇందులో మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాలున్నాయి. ఈ పథకానికి రూ.4,445 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, 2021-22 నుంచి 2027-28 నాటికి పనులు పూర్తిచేయాలని నిర్ణయించింది. పీఎం మిత్ర మార్గదర్శకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేసి టెక్స్టైల్ పార్క్ను అభివృద్ధి చేయాలి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోపాటు డెవలపర్ ఉంటారు.
టెక్స్టైల్ పార్క్ కోసం రాష్ట్ర ప్రభుత్వం కనీసం వెయ్యి ఎకరాల స్థలాన్ని సమకూర్చాలి. కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉంటుంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలిచి డెవలపర్ను ఎంపిక చేయాలి. మాస్టర్ప్లాన్ను రూపొందించి దానికి టెక్స్టైల్ శాఖ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతర్గత రోడ్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థ, మంచినీరు సరఫరా, వృధా నీటి శుద్ధి తదితర సౌకర్యాలు అభివృద్ధి చేసి వస్ర్తాల డిజైనర్లు, దుస్తుల తయారీదారులు, ఇంక్యుబేషన్ సెంటర్లకు ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలు కల్పించాలి. అంతేకాకుండా, కామన్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈటీపీ), కార్మికుల (ముఖ్యంగా మహిళలకు)కు వసతి సదుపాయం, ఆరోగ్య సౌకర్యాలు, శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, వేర్హౌసింగ్, లాజిస్టిక్స్ వంటి అదనపు ఏర్పాట్లు కూడా చేయాల్సి ఉంటుంది. కంపెనీలకు స్థలాల కేటాయింపు సైతం ఎస్పీవీ ఆధ్వర్యంలోనే చేపట్టాలి. ఇవన్నీ చేస్తే మొదటి దశలో రూ.300 కోట్లు, రెండో దశలో రూ.200 కోట్లు కలిపి మొత్తం రూ.500 కోట్లు కేంద్రం గ్రాంటుగా ఇస్తుంది. ఈ పార్కుల్లో ఏర్పాటుచేసే కంపెనీలకు కూడా కేంద్రం ప్రత్యేక రాయితీలు కల్పిస్తుంది.
రాష్ర్టానికి పీఎం మిత్ర లేనట్టే
పీఎం మిత్ర పథకం కింద కేఎంటీపీకి గ్రాంటు వచ్చే అవకాశం దాదాపు లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. టెక్స్టైల్ పార్క్ మంజూరైనట్టు ఇంతవరకు ఎటువంటి అధికారిక సమాచారం రాకపోవడమే కాకుండా ఇటీవల కేంద్ర టెక్స్టైల్ శాఖ కార్యదర్శి కేఎంటీపీ పీఎం మిత్ర మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని అన్నట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలు మన రాష్ట్ర ప్రాజెక్టు కోసం సవరించడం సాధ్యం కాకపోవచ్చని, కొత్తగా మరో వెయ్యి ఎకరాల్లో ఎక్కడైనా టెక్స్టైల్ పార్క్ను అభివృద్ధి చేసి దాన్ని పీఎం మిత్రలో చేర్చవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరో టెక్స్టైల్ పార్క్ను అభివృద్ధి చేయడం సాధ్యం కాదని, అందుకే మనం కేంద్రం గ్రాంటుపై ఆశలు వదులుకోవాల్సిందేనని సదరు అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం.
02.02.2021 రాష్ట్రం వినతి
బడ్జెట్లో కేంద్రం ప్రకటించిన 9 జాతీయ టెక్స్టైల్ పార్కుల జాబితాలో వరంగల్కు అవకాశం ఇవ్వండి.
– నాటి జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ లేఖ.
17.03.2023 కేంద్రం ప్రకటన
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇవి రూ.కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయి. మేకిన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్కి ఇవి ఉదాహరణగా నిలుస్తాయి.
– ట్విటర్లో ప్రధాని నరేంద్రమోదీ ప్రకటన
8.04.2023 ప్రధాని మాట
దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్టైల్ పార్క్లు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణలో కూడా మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
– హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ