Secunderabad | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అత్యంత కీలకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు స్వయానా ప్రధాని మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఏటా రూ.500 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వేకు ఇచ్చే ఈ స్టేషన్ ఆధునీకరణ అంచనా వ్యయం ఎంతో తెలుసా? రూ.699 కోట్లు! ఈ పనులు మూడేండ్లలో పూర్తవుతాయని రైల్వే శాఖ చెప్తున్నది. అంటే ఈ పనులు పూర్తయ్యే కాలంలోనే రైల్వేకు ఈ స్టేషన్ ద్వారా వచ్చే ఆదాయం రూ.1,500 కోట్లు. కేంద్రానికి వచ్చే ఆదాయంలో కేవలం 47 శాతమే ఖర్చు చేస్తుందన్నమాట.
ఎస్సీఆర్లో అత్యధిక ఆదాయం ఇక్కడి నుంచే…
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో (ఎస్సీఆర్) ఎన్ఎస్జీ-1 స్టేషన్ సికింద్రాబాద్ ఒక్కటే. ఎన్ఎస్జీ-1 అంటే నాన్ సబర్బన్ గ్రేడ్-1. రైల్వే శాఖ మార్గదర్శకాల ప్రకారం ఏటా రూ.500 కోట్ల ఆదాయం/20 మిలియన్ల ప్రయాణికులు వినియోగించే స్టేషన్ను ఎన్ఎస్జీ-1 పరిధిలోకి తీసుకొంటారు. రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, సుమారు 1.80 లక్షల మంది ప్రయాణికులు వినియోగించుకొంటారు. ఇంత కీలకమైన స్టేషన్ను ఎప్పుడో ఆధునీకరించాల్సింది. కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్లపాటు కాలయాపన చేసింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసం స్టేషన్ ఆధునీకరణ పనులంటూ హంగామా చేస్తున్నారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.