విపక్ష ప్రభుత్వాలను అస్థిర పరిచేందుకు కుట్ర చేయాలి. బలవంతుడైన నాయకుడు ఎదురు తిరిగినచోట ఈడీ, ఐటీలతో సోదాలు చేయించాలి. ఇదీ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం తీరు. అనేక రాష్ర్టాల్లో జరిగింది, ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్నది ఇదే. ఇట్ల జరుగుతుందని.. కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ సమాజం, టీఆర్ఎస్.. ఆ మాటకొస్తే చైతన్యవంతుడైన ప్రతి తెలంగాణ పౌరుడు ఊహించాడు. ఈ దాడులు ఎవరెవరిపై జరుగుతాయో పేర్లతో సహా నమస్తే తెలంగాణ ముందే చెప్పింది. చెప్పినట్టుగానే మంత్రి మల్లారెడ్డిపై మంగళవారం ఐటీ సోదాలు మొదలయ్యాయి.
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు ఎక్కడా జరగని రీతిలో ఏకంగా 60 బృందాలతో సోదాలు చేశారు. వీరికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సీఆర్పీఎఫ్ రక్షణ, బందోబస్తు ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ బోయినపల్లిలో మల్లారెడ్డి నివాసంతోపాటు ఆయన కుమారులు మహేందర్రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి, మల్లారెడ్డి సమీప బంధువుల ఇండ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. మంత్రి మల్లారెడ్డి అల్లుడు, టీఆర్ఎస్ మల్కాజ్గిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు.
రాజశేఖర్రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు. కొంపల్లిలో ఉండే మంత్రి కుమారులు మహేందర్రెడ్డి, భద్రారెడ్డితోపాటు ‘సుచిత్ర’ ప్రాంతంలో ఉండే మంత్రి సమీప బంధువులు రఘునాథ్రెడ్డి, సంతోష్రెడ్డి, త్రిశూల్రెడ్డి, మల్లారెడ్డి సోదరుడు గోపాల్రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఇప్పటి వరకు ఎలాంటి పత్రాలు, నగదును స్వాధీనం చేసుకోలేదని తెలిసింది. కాగా మంత్రి సోదరుడు గోపాల్రెడ్డి ఇంట్లోని లాకర్ను తెరిపించగా అందులో కొన్ని పత్రాలు మాత్రమే ఉన్నాయని, ఎలాంటి నగదు లభించలేదని సమాచారం. హైదరాబాద్ బాలానగర్లోని క్రాంతి బ్యాంకులో మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల లావాదేవీలు జరుగుతాయనే సమాచారంతో ఆ బ్యాంకు ఎండీ రాజేశ్వరరావు ఇంట్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. మొత్తం 60 బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. మంత్రి నివాసంలో మాత్రం 8 మంది ఉన్నతాధికారులతోపాటు 18 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. సీఆర్పీఎఫ్ బలగాల బందోబస్తు మధ్య ఐటీ సోదాలు జరిగాయి.
కేంద్రం తాటాకు చప్పుళ్లకు భయపడం: మంత్రి తలసాని
కేంద్ర ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టం చేశారు. తన ఆధీనంలోని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని కేంద్రం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే బెదిరేది లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి మహమూద్ అలీ, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లతో తలసాని సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని భయభ్రాంతులకు గురిచేయాలని కేంద్రంలోని బీజేపీ చూస్తున్నదని విమర్శించారు. చేతనైతే రాజకీయంగా ఎదురోవాలని సవాల్ విసిరారు. బీజేపీ చేస్తున్న దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని హెచ్చరించారు.
కేంద్రానివి కక్ష సాధింపు చర్యలు: మంత్రి శ్రీనివాస్గౌడ్
మారేడ్పల్లి, నవంబర్ 22: కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగానే రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి నివాసాలపై ఐటీ దాడులు చేస్తున్నదని ఆబ్కారీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. మంగళవారం సికింద్రాబాద్లో ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదన్నారు. దేశంలో అనేక రాష్ర్టాలతో పోలిస్తే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని, కేంద్రం సహకరించాల్సింది పోయి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి దాడులు చేయించడం సరికాదని హితవుపలికారు.
దాడులకు భయపడం: కొప్పుల
ధర్మారం/ పాలకుర్తి, నవంబర్ 22: మోడీ అసమర్థ పాలనను కప్పిపుచ్చి ప్రజల దృష్టిని మరల్చేందుకు టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఇండ్లపై ఐటీ, ఈడీ సోదాలు చేయిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఎవరేం చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఇంకెన్నాళ్లీ కక్ష సాధింపు చర్యలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను కూల్చే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగబోవని హెచ్చరించారు.
మంత్రి ఇంటి ఎదుట కార్యకర్తలు నినాదాలు.. ప్రధాని దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఐటీ తనిఖీల విషయం తెలుసుకొన్న టీఆర్ఎస్ శ్రేణులు, మల్లారెడ్డి అభిమానులు, అనుచరులు పెద్ద ఎత్తున ఆయన నివాసం వద్దకు తరలివచ్చారు. మంత్రిని బయటికి పంపించాలని, బీజేపీ అక్రమ సోదాలు ఆపాలని, మోదీ డౌన్డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీజేపీ నాయకుల్లారా ఖబడ్దార్ అంటూ నినదించారు. బోయినపల్లి చౌరస్తాలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశాయి. రాత్రి 8 గంటల సమయంలో మంత్రి మల్లారెడ్డి బయటికి వచ్చి అభివాదం చేశారు. టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు.