తెలంగాణ పుట్టుకనే ప్రశ్నించిన ప్రధాని మోదీ.. తనకు తెలంగాణ ఒక చిక్కు ప్రశ్నగా మారడాన్ని సహించలేకపోతున్నట్టున్నారు. అసహనానికి అధికారాన్ని అద్ది ఆయుధంగా ప్రయోగిస్తున్నారు.
ఒకవైపు నుంచి ఈడీ, మరోవైపు నుంచి ఐటీ, ఇంకోవైపు నుంచి సీబీఐ, వేరేవైపు నుంచి గవర్నర్, కేంద్రం నుంచి సహాయ నిరాకరణ, నిధులివ్వకుండా ఆర్థిక నిరోధాలు, కనీసం అప్పైనా పుట్టకుండా ఆంక్షలు, వాట్సాప్ వర్సిటీతో అబద్ధాల రాద్ధాంతం, రాష్ట్ర పార్టీ రాజకీయ దొంగ యుద్ధం, రాజధాని హైదరాబాద్లో మతకలహాలు రేపే వ్యాఖ్యలు, గుప్తచరులతో కూల్చివేత కుట్ర.. ఇదీ ఇప్పుడు మన తెలంగాణపై మోదీ సర్కారు పేట్రేగి పన్నిన చక్రబంధం!
కారణమేదైతేనేం.. ధర్మపన్నాలు ప్రవచనాలు ఆగిపోయి అసలు రంగు బయటపడుతున్నది. కేసీఆర్ను నేరుగా, రాజకీయంగా, ప్రజాస్వామ్య బద్ధంగా ఢీకొట్టే చేవలేక, బీజేపీ మాయా యుద్ధానికి దిగింది. తెలంగాణ ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, టీఆర్ఎస్కు ఎవరూ సహకరించకుండా దర్యాప్తు సంస్థలతో బెదిరించడం ఇందులో భాగం. కేసీఆర్ గొంతెత్తిన వెంటనే తెలంగాణ టార్గెట్గా మారింది. మునుగోడులో ఓటమి కాటు వేయగానే దర్యాప్తు సంస్థలకు పనిబడింది. అమిత్షాను కలిసిన తెల్లారే గవర్నర్ తమిళిసై షో మారింది.
‘కోడలుకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకినట్టు’ కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటూ ఊదరగొట్టిన బీజేపీ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న అవలక్షణాలన్నింటినీ మరింత నిర్లజ్జగా వాడుతున్నది. బీజేపీలో సెకండ్ ర్యాంకు అంటూ లేకుండా నిర్మూలించిన మోదీ- షా ద్వయం ఇప్పుడు దేశంలోనూ తమకు ఎదురే లేకుండా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగమే ప్రతి విపక్ష రాష్ట్రంలోనూ గవర్నర్ల కయ్యాలు, దర్యాప్తు సంస్థల దాడులు! మహారాష్ట్రలో ఉద్ధవ్ఠాక్రే సర్కారున్నన్ని రోజులు సతాయించిన గవర్నర్ భగత్సింగ్ కోష్యారీ, బీజేపీ సర్కారు గద్దెనెక్కగానే మౌనం వహించడం దేనికి సూచిక? విపక్ష పాలిత రాష్ర్టాల్లోలాగే బీజేపీ రాష్ర్టాల్లోని గవర్నర్లు రాజకీయ పర్యటనలు ఎందుకు జరపరు? బిల్లులెందుకు ఆపరు? ఫోన్లు ట్యాప్ అవుతున్నాయనే వివాదా స్పద వ్యాఖ్యలెందుకు చేయరు? గిచ్చి కొట్లా ట ఎందుకు పెట్టుకోరు? అర్థం చేసుకోలేనంత తెలివి తక్కువ వాళ్లా ప్రజలు!
జాతీయ పార్టీ పెడుతున్నా అని కేసీఆర్ అనగానే ముందు పట్టించుకోనట్టు నటించారు. కొన్ని రోజుల తర్వాత ‘కేసీఆరా.. జాతీయ రాజకీయాలా?’ అని హేళన చేశారు. కానీ వారెంత బెదిరిపోతున్నారో ఇప్పుడు అర్థమవుతున్నది.
అందుకే మోదీ పదేపదే జపించే మహాత్మాగాంధీ ఏమన్నాడంటే..
First they ignore you, then they laugh at you,
then they fight you, then you win
‘ఛప్పన్ ఇంచ్’ ఛాతి పాలన దేశంలో విఫలమైందే అన్న బాధా?
గుజరాత్కన్నా తెలంగాణ సూచిక పరుగు తీస్తున్నదన్న అసూయా?
సీఎం కేసీఆర్ నన్నే ధిక్కరించి నిలదీస్తాడా అన్న అహంభావమా?
తెలంగాణ నుంచి ఒక జాతీయ పార్టీ అవతరిస్తున్నదన్న అసహనమా?
మునుగోడు ఎత్తుగడ విఫలమై నిండా మునిగామన్న నిరాశావాదమా?
తెలంగాణ సర్కారు కూల్చివేత కుట్ర కూలిపోయిందన్న నిస్పృహనా?
‘గవర్నర్, కేంద్ర ప్రభుత్వం మా ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నది. రాజ్భవన్ నుంచి సమాంతర సర్కారు నడపాలని చూస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మన రాజ్యాంగం ఏర్పరిచిన సమాఖ్య వ్యవస్థను కుళ్లబొడుస్తున్నది. రాష్ట్రంలో ప్రజాభిప్రాయంతో ఎన్నికైన ప్రభుత్వాన్ని తక్కువ చేస్తున్నది. రాజ్భవన్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే వ్యవస్థలా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ గవర్నర్ అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. వైస్ చాన్స్లర్లను కూడా నియమించనివ్వటం లేదు. ఈ గవర్నర్ పనితీరుతో ఆ పదవికున్న గౌరవాన్నే తీసేశారు. ఈ గవర్నర్ను తొలిగించాలని డిమాండ్ చేస్తున్నా! దీనికి స్పందించాల్సిందిగా కేంద్ర సర్కారును డిమాండ్ చేస్తున్నా!!’
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరో..
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలినో..
బెంగాల్ ముఖ్యమంత్రి మమతనో..
కేరళ ముఖ్యమంత్రి విజయనో..
అన్న మాటలు కావవి..
ఘనత వహించిన మన ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నోటినుంచి రాలిన ఆణిముత్యాలు!
2011 సెప్టెంబర్లో అహ్మదాబాద్లో 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ పెట్టి.. అప్పటి గుజరాత్ గవర్నర్ కమలా బేణీవాల్పై మోదీ ఈ విమర్శల వర్షం కురిపించారు.
అంతేకాదు.. తాను ప్రధాని అవటానికి సరిగ్గా ఏడాది ముందు 2013లో అసెంబ్లీలో గుజరాత్ విశ్వవిద్యాలయ సవరణ చట్టానికి ఆమోదం పొందారు. దాని ద్వారా రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలపై చాన్స్లర్ రూపంలో గవర్నర్కు ఉన్న అధికారాలకు కత్తెర వేశారు. వీసీలను నియమించే అధికారాన్ని లాగేసుకున్నారు.
నాటి ముఖ్యమంత్రి మోదీ మాటలు.. నేటి ప్రధాని మోదీకి వర్తిస్తాయా.. లేదా? ఇదీ ప్రజల ప్రశ్న.. ఏ సవాల్ హై.. జవాబ్ దో..
విపక్ష నేతలపైకి ఈడీ, సీబీఐ, ఐటీ
ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే కుట్ర
ప్రతిపక్ష నేతల సన్నిహితులే టార్గెట్..
బీజేపీలో చేరితే బారాఖూన్ మాఫ్
కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించిన ముఖ్యమంత్రి కేసీఆర్
మరుసటి రోజు నుంచే కేంద్రం ఫోకస్
రాష్ట్రంపై కుట్రలు, కుతంత్రం మొదలు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దమననీతికి నిదర్శనాలెన్నో..
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): దారికొస్తే దావత్.. ఎదురు నిలిస్తే ఐటీ సోదాలు.. అక్రమ కేసులు! దేశంలో నేడు ఏ మూలన చూసినా ఇదే తీరు కనిపిస్తున్నది. కేంద్రం చెప్పినట్టు విని, అణిగిమణిగి ఉంటే అవినీతి కంపులో దొర్లినా సెంటు వాసనే వస్తున్నది.. రాజకీయంగా ఎదిరిస్తే మాత్రం మల్లెపువ్వుకు కూడా మలినం అంటుతున్నది. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో చూసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరు ఇలాగే ఉన్నది. దేశాన్ని అధోగతిపాలు చేస్తున్న మోదీ ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు యుద్ధం ప్రారంభించటమే ఆలస్యం ఈడీ, ఐటీ, సీబీఐ.. ఇంకా చిన్నాపెద్ద దర్యాప్తు సంస్థలన్నీ హైదరాబాద్కు పయనమయ్యాయి. ఇదిగో అవినీతి అంటూ బీజేపీ అనుకూల మీడియాకు లీకులివ్వటం.. అవి రోజంతా బ్రేకింగ్ అంటూ ఫేక్ వార్తలు వదలటం పరిపాటిగా మారింది. కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ర్టాల్లోనూ ఇదే పద్ధతి కనిపిస్తున్నది. దక్షిణాది ప్రాంతీయ పార్టీల అధినేతలను ఏమీ చేయలేక, వారి సన్నిహితులను లక్ష్యంగా చేసుకొంటున్నట్టు కనిపిస్తున్నది. కేరళ సీఎం పినరాయి విజయన్కు సన్నిహితంగా ఉండే ఐఏఎస్ అధికారులను బంగారం స్మగ్లింగ్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించినట్టు ఆరోపణలున్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ మేనల్లుడు శబరీశన్ను సైతం లక్ష్యం చేసుకొన్నది. తాజాగా తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో అడుగడుగునా అక్రమార్కులు, అవినీతిపరులే ఉన్నా.. వారిని కేంద్రం కంటికి రెప్పలా కాపాడుతున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. బీజేపీ గురివింద గింజ రీతిపై మేధావులు మండిపడుతున్నారు.
ఫిర్యాదులు వాళ్లవే.. దర్యాప్తూ వాళ్లదే
ప్రతిపక్ష నేతలపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి వేధించే విషయంలో మోదీ సర్కారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నది. టార్గెట్ చేసిన వ్యక్తులపై మొదట బీజేపీ, ఆ పార్టీకి మద్దతుగా ఉండే వ్యక్తులే ఫిర్యాదులు చేస్తారు. ఫిర్యాదులు ఇలా అందగానే.. అధికారులు రంగంలోకి దిగిపోయి హడావిడి మొదలుపెడుతారు. తెలంగాణకే తలమానికంగా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సీబీఐకి ఈ ఏడాది అక్టోబర్ 7న ఫిర్యాదు చేశారు. అంతకుముందు గవర్నర్కు కూడా ఫిర్యాదు చేశారు. మే 12న ప్రజాశాంతిపార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్షాను కలిసి తెలంగాణలో భారీ అవినీతి జరుగుతున్నదని ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ సోదాలంటూ హంగామా సృష్టించటం మొదలుపెట్టింది. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, వాళ్ల సన్నిహితుల ఇండ్లు, కార్యాలయాలపైనే మొదట దాడులు నిర్వహించి గందరగోళం సృష్టిస్తున్నది.
గజ దొంగలు, బ్యాంకుల రుణాల ఎగవేతలో ఆరితేరిన
ఘనులుగా కీర్తి పొందినవారు సైతం బీజేపీ పంచన చేరగానే
పవిత్రులైపోతున్నారు. మచ్చుకు కొందరు..
సుజనా చౌదరి: టీడీపీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి ఇండ్లు, కంపెనీలపై 2018 నవంబర్లో ఈడీ, 2019 జూన్ 2న సీబీఐ దాడులు జరిగాయి. బీజేపీలో చేరిన తర్వాత ఆయనవైపు ఏ కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా కన్నెత్తి చూడలేదు.
సీఎం రమేశ్: టీడీపీకే చెందిన సీఎం రమేశ్ కార్యాలయాల్లో 2018 అక్టోబర్లో ఐటీ, 2019 ఏప్రిల్లో ఈడీ సోదాలు జరిగాయి. ఆయన సైతం ఢిల్లీ బీజేపీ పెద్దల సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగానే ఆయనపై నమోదైన కేసులు గాయబ్!
జ్యోతిరాదిత్య సింధియా: మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాధిత్య సింధియాపై భూ ఆక్రమణ కేసులున్నాయి. 2020 మార్చిలో ఆయన బీజేపీలో చేరగానే ఆ కేసే మూతపడింది.
హిమంత బిశ్వశర్మ: శారద చిట్ఫండ్స్ స్కాంలో నిందితుడిగా ఉన్న హిమంత బిశ్వశర్మ ఇంట్లో 2014 నవంబర్లో సీబీఐ సో దాలు నిర్వహించింది. ఆగస్టు 2015లో ఆయన బీజేపీలో చేరడంతో కేసులన్నీ అటకెక్కాయి. అస్సాం సీఎం కూడా అయ్యారు.
నారాయణ్ రాణె: మహారాష్ట్రకు చెందిన ఈ కాంగ్రెస్ నేతపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. 2017లో బీజేపీకి అనుబంధంగా సొంత పార్టీని పెట్టారు. తర్వాత 2019లో తన పార్టీని బీజేపీలో విలీనం చేసి కృతజ్ఞత చాటుకున్నారు.
ముకుల్ రాయ్: పశ్చిమబెంగాల్లో సంచలనం సృష్టించిన నారద కేసులో సీబీఐ పలుసార్లు ముకుల్రాయ్కు నోటీసులు ఇచ్చింది. ఈ దెబ్బతో ఆయన 2017లో బీజేపీ చేరారు. దీంతో కేసు విచారణ ఆగిపోవడమే కాదు..2021లో ముకుల్రాయ్కు ఏకంగా క్లీన్చిట్ వచ్చేసింది. ఆ తర్వాత ఆయన మళ్లీ తృణముల్పార్టీలో చేరారు.
సువేందు అధికారి: పశ్చిమబెంగాల్కు చెందిన టీఎంసీ నేత సువేందు అధికారిని శారద కుంభకోణంలో 2014 నుంచి సీబీఐ పలుమార్లు ప్రశ్నించింది. 2020లో ఆయన బీజేపీలో చేరడంతో విచారణ ముగిసింది.
ఆర్థిక మూలాలు దెబ్బకొట్టే కుట్ర
బీజేపీ నేతలు తమను వ్యతిరేకించే పార్టీలను సహించట్లేదు. ఆ పార్టీలకు సన్నిహితంగా ఉండేవారే మొదటి టార్గెట్! ఆర్థిక మూలాలను దెబ్బకొడితే తమకు లొంగుతారన్నది బీజేపీ స్కెచ్! ఫ్యాక్షనిస్టుల తరహాలోనే ఆర్థిక మూలాలను టార్గెట్ చేస్తున్నదని పరిశీలకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఎన్నికలున్న రాష్ర్టాల్లో ఈడీ, సీబీఐ, ఐటీలను అస్ర్తాలుగా మార్చుకొంటున్నదని ఆరోపిస్తున్నారు. 2014 నుంచి 2022 జూలై వరకు దేశవ్యాప్తంగా ఈడీ 3,010 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించింది. యూపీఏ హయాంలోకంటే 27 రెట్లు రైడ్స్ పెరిగినట్టు కేంద్రమే పార్లమెంట్కు తెలిపింది. గత ఎనిమిదేండ్లలో ఈడీ నమోదు చేసిన కేసుల్లో శిక్షపడిన వారి సంఖ్య 25 మాత్రమే. దీనినిబట్టే ఈడీ కేసుల్లో అత్యధికం రాజకీయ కోణంలో ఉంటున్నాయని అర్థమవుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.