కరీంనగర్ కార్పొరేషన్, నవంబర్ 13: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెలంగాణకు నిధులు విడుదల చేయకుండా, ఇక్కడి సంపదను కొల్లగొట్టే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఢిల్లీ పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం ఆగదని స్పష్టం చేశారు. ఆదివారం కరీంనగర్లోని 16, 46వ డివిజన్లలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. అనంతరం మంత్రి గంగుల మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ, ఢిల్లీ పాలకులు హైదరాబాద్ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఎన్టీపీసీ, కోల్స్ దోచుకునే యత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
నీళ్లు ఎత్తుకుపోయే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని ఓ విపక్ష నాయకుడిగా మాట్లాడటం బాధాకరమన్నారు. ప్రధాని హూందాగా మాట్లాడాలని, కానీ ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడటం సరికాదన్నారు. ప్రధాని రాష్ర్టానికి వస్తున్నారంటే ఏదైనా ఇస్తారని ఆశపడతారని, రాష్ట్రం నుంచి రూ.4 లక్షల కోట్ల జీఎస్టీ కడుతున్నామని, అందులోంచి ఏమైనా ప్రకటిస్తారని ఆశపడటంతో తప్పులేదన్నారు. ‘జీఎస్టీ కట్టడం మా వంతు.. పంచడం గుజరాత్కా? శ్రమ మాది ఫలితాన్ని గుజరాత్కు పంచుతారా?’ అని నిలదీశారు. ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే ఫ్యాక్టరీలు, సంస్థలు ఇస్తారని ఆశపడితే, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని మండిపడ్డారు. ఒక్క తెలంగాణపైనే ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో ఢిల్లీలోనూ మార్పులు వస్తాయని, రాష్ట్ర అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరన్నారు. కొందరు వ్యక్తులు ఇప్పుడు మళ్లీ పాదయాత్రలు, కోతి వేషాలు వేసుకుంటూ వస్తున్నారని విమర్శించారు. ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా ఒక్క ఓటు పడే పరిస్థితి లేదన్నారు.