హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు విషయంలో కేం ద్ర ప్రభుత్వం నానాటికీ దిగజారుడు వైఖరిని అవలంబిస్తున్నది. పార్లమెంట్లో చేసిన చట్టాలను అమలు చేయకుండా కుంటి సాకులతో తన వైఖరిని నిస్సిగ్గుగా సమర్థించుకొంటున్నది. పొంతన లేని మాటలతో తెలంగాణ హక్కును కాలరాస్తున్నది. బయ్యారం ఇనుప ఖనిజంలో నాణ్యతలేదని, ఇతర ప్రాంతాలనుంచి ముడిసరుకు రవాణా చేయడం వల్ల నష్టం వాటిల్లుతుందని చెప్తూ స్టీల్ ప్లాంట్ను ఏర్పాటు చేయకుండా తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నది. వాస్తవానికి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఇనుప ఖనిజం నిక్షేపాలు అపారం. ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లోనే 1,41,691 ఎకరాల విస్తీర్ణంలో ఇనుప ఖనిజం ఉన్నది. అక్కడ 12 వేల కోట్ల టన్నుల ముడి ఇనుము లభిస్తుందని, దాని విలువ లక్షల కోట్లలో ఉంటుందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే స్పష్టం చేసింది. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో హెమటైట్ రకం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో మాగ్నటైట్ రకం నిక్షేపాలున్నట్టు 2004లోనే ప్రకటించింది. కేవలం రూ.వెయ్యి కోట్లతోనే బయ్యారంలో ఇనుప ఖనిజాన్ని శుద్ధిచేసే కర్మాగారాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని, తద్వారా రోజూ 100 మెట్రిక్ టన్నుల స్పాంజ్ ఐరన్ ఉత్పత్తికి వీలవుతుందనేది నిపుణుల మాట. దీంతో నాటి యూపీఏ సర్కారు రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశాన్ని పొందుపర్చింది. కానీ, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు ఈ అంశాన్ని తుంగలో తొక్కింది. బయ్యారంలో నాణ్యమైన ఇనుము లేదని సాకు చూపింది.
పొంతనలేని మాటలు
బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. గతంలో ఎన్ఎండీసీ సంబురాల్లో పాల్గొన్న నాటి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్.. తెలంగాణలో ఇనుప ఖనిజ నిక్షేపాలు అపారంగా ఉన్నాయని అంగీకరించడంతోపాటు కొత్తగూడెం, పాల్వంచలో పెల్లెటైజేషన్ ప్లాంట్, స్క్రాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యంకాదని రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఇటీవల చెప్పారు. రాష్ట్ర విభజన సమయంలో సాధ్యాసాధ్యాలను సరిగా పరిశీలించలేదని, స్టీల్ ఉత్పత్తికి స్థానికంగా ముడిసరుకు లభ్యత ఉన్నదా? లేదా? అనే విషయాలను అంచనా వేయకుండా బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు నిర్ణయం తీసుకొన్నారని వ్యాఖ్యానించారు.
ఖనిజం లేకున్నా విశాఖలో స్టీల్ ప్లాంట్
వాస్తవానికి విశాఖలో గానీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గానీ ఎటువంటి ఇనుప ఖనిజాలు లేవు. అయినా అక్కడ ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించారు. కేవలం నీటి వనరు ఆధారంగానే ఆ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి ఒడిశా, ఛత్తీస్గఢ్, బైలదిల్లా, కర్ణాటక తదితర సుదూర ప్రాంతాల నుంచి విశాఖకు ఖనిజాన్ని తరలిస్తున్నారు. కానీ, బయ్యారానికి కేవలం 180 కి.మీ. పరిధిలోనే ఛత్తీస్గఢ్లో బైలదిల్లా ఇనుప ఖనిజాలున్నాయి. ఒడిశాలోని గనులు సైతం బయ్యారానికి దగ్గరగానే ఉన్నాయి. అయినా బయ్యా రం ప్లాంటు ఏర్పాటు వల్ల నష్టాలు వస్తాయని కేంద్రం చెప్తున్నది.
రవాణా ఖర్చు భరించేందుకు సిద్ధమన్న కేటీఆర్
కేంద్రం అబద్ధాలను ఎండగడుతూ మంత్రి కేటీఆర్ ఇటీవల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బయ్యారానికి బైలదిల్లాలోని గనులను కేటాయించాలని, అక్కడి నుంచి బయ్యారానికి ఇనుప ఖనిజాన్ని తరలించేందుకు స్లర్రీ పైప్లైన్ లేదా రైల్వేలైన్ వేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ఇందుకు రవాణా ఖర్చులు భరించేందుకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. బయ్యారంలో పెల్లెటైజేషన్ ప్లాంట్, స్క్రాప్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ఎండీసీ, మెటలర్జికల్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ (మేకాన్) సానుకూలంగా నివేదిక ఇచ్చినప్పటికీ మోదీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు. ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యపడకపోతే తాత్కాలింకగా పెల్లెటైజేషన్ ప్లాంట్ను ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.
1,41,691 ఎకరాల్లో ఖనిజం
ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లోనే 1,41,691 ఎకరాల (56,690 హెక్టార్ల) విస్తీర్ణంలో ఇనుప ఖనిజం ఉన్నది.
12,000 వేల కోట్ల టన్నులు
12 వేల కోట్ల టన్నుల ముడి ఇనుము స్థానికంగానే లభిస్తుందని, విలువ రూ.లక్షల కోట్లలో ఉంటుందని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గతంలోనే తేల్చింది.