వేల్పూర్, నవంబర్ 14 : తెలంగాణలో పండిన ధాన్యం కొనడానికి చేతకాని బీజేపీ.. ఒక్కో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మాత్రం రూ.100కోట్లు ఇచ్చి కొంటదట అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. సోమవారం బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ పార్టీల నుంచి సుమారు 1,000 మంది కార్యకర్తలు మంత్రి వేముల సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వీరికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లక్కోర గ్రామ శివారులోని ఓ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, కేంద్రప్రభుత్వ వైఖరి, ప్రధాని మోదీ వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు.
కేసీఆర్ కన్నా మెరుగ్గా.. రైతులకు, పేదలకు మోదీ ఏం చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన హామీ ఏమైందని మోదీని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఇప్పటివరకు లక్ష ఉద్యోగాలు ఇచ్చారని స్పష్టంచేశారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నదని తెలిపారు. ముందుగా మంత్రి మెండోరా మండలంలోని వేల్పూర్ శివారులో వెంచిర్యాల్ను కలుపుతూ ఉన్న గుండె వాగుపై రూ. కోటీ 83 లక్షల నిధులతో నిర్మించిన వంతెనను, జాతీయ రహదారి నుంచి పడగల్కు వెళ్లే దారిలో రూ.2కోట్ల 75లక్షలతో నిర్మించిన హైలెవల్ వంతెనను ప్రారంభించారు.