బీబీనగర్ ఎయిమ్స్కి కేంద్రం ఆమోదం తెలిపింది 2018 డిసెంబర్లో!
2022 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నది తొలి వాగ్దానం. కానీ కాలేదు.
టెండర్లు పిలిచిందే 2022 జూలైలో! రెండేండ్లలో పూర్తి మలి వాగ్దానం. కాలేదు.
2025 జూన్కు పూర్తి చేస్తామన్నది ముచ్చటగా మూడో వాగ్దానం. అవుతుందా?
ఎందుకంటే… రూ.1028 కోట్లుగా అంచనా వేసిన వ్యయం ఇప్పటికే 1366 కోట్లకు పెరిగింది. ఇందులో ఈ ఐదేండ్లలో ఇచ్చింది కేవలం 350 కోట్లు. అంటే 25%. మనకంటే తర్వాత మంజూరైన గుజరాత్ ఎయిమ్స్కు మాత్రం 52% నిధులు అంటే 622 కోట్లను కేంద్రం ఇచ్చేసింది!
కేంద్ర క్యాబినెట్ మంజూరు చేసిన ఐదేండ్ల తర్వాత, ఎట్టకేలకు పనులు మొదలైన పది నెలల తర్వాత ఇవాళ వచ్చి ఎయిమ్స్కి భూమి పూజ చేశారు! అయినా తెలంగాణ మీద తనకు, బీజేపీకి చాలా ప్రేమ ఉంది, నమ్మండి అన్నారు ప్రధాని మోదీ!
ఐదేండ్లలో ఒక భవనానికి పునాదులు కూడా పూర్తిగా తవ్వలేని వారు, మూడున్నరేండ్లలో కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టు కట్టి, పొలాలకు నీళ్లు పారించిన తెలంగాణకు పాఠాలు చెప్తారు. – మనం సహించాలి!!
భాగ్యలక్ష్మి అమ్మవారు కొలువైన హైదరాబాద్ నగరాన్ని, వేంకటేశ్వరుడి నెలవైన తిరుపతితో అనుసంధానం చేస్తూ వందేభారత్ రైలు వేశామని అన్నారు ప్రధాని. హైదరాబాద్ ఏమైనా ద్వీపమా? ఇంతకుముందు తిరుపతికి ఇక్కడి నుంచి రైలే లేదా? ఇదే మొదటి రైలా? ఈ ప్రశ్నల్ని వదిలేద్దాం! తెలంగాణలో, జంటనగరాల్లో అత్యంత ప్రఖ్యాతిగాంచిన ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారు కాకుండా ప్రధాని స్థాయి వ్యక్తికి భాగ్యలక్ష్మి గుడే ఎందుకు కనబడింది?! – మనం ఆలోచించుకోవాలి!!
రైతుబంధుతో తెలంగాణ ప్రభుత్వం 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా వేసిన మొత్తం 65 వేల కోట్లు. అక్షరాలా అరవై ఐదు వేల కోట్లు. రైతు బంధును కాపీ కొట్టి మోదీ పెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి కింద తెలంగాణలో ఇచ్చిన మొత్తం కేవలం 9 వేల కోట్లు. అదీ 35 లక్షల మంది రైతులకే, సవాలక్ష షరతులతో! వడ్లు కొనకుండా, నూకలు తినమంటూ ఎద్దేవా చేయడమూ తెలంగాణ రైతులపై ప్రేమకు నిదర్శనమే. – మనం నమ్మాలి!!
తెలంగాణ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల మీదుగా పొరుగు రాష్ర్టాలకు పోయే హైవేలకు శంకుస్థాపన చేశారు. దాన్ని తెలంగాణలో సదుపాయాల అభివృద్ధి అన్నారు. – మనం వినాలి!!
తెలంగాణలో 7.5 లక్షల మందికి ముద్రా రుణాలిచ్చినట్టు ప్రధాని చెప్పారు. ముద్రా రుణాల్లో దేశవ్యాప్త సగటు 25.44%. తెలంగాణ జాతీయ సగటుకు చేరుకోవాలంటే ఇంకా 96,43,540 మందికి ముద్రా రుణాలందాలి. అయినా తెలంగా ణకు బాగా నిధులిస్తున్నామని మోదీ సమర్థించుకున్నారు. – మనం ఆలకించాలి!!
మోదీ ప్రధాని కావడానికి ముందే 2013 జనవరి 1నే ప్రారంభమై దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో, 27 కేంద్ర పథకాలకు అమలైన నగదు బదిలీని తానే కనిపెట్టినట్టు చెప్పుకొన్నారు. – మనం అంగీకరించాలి!!
ఇలాంటి ప్రశ్నలు మనం అడగకూడదు. అడిగితే ప్రధాని దుఃఖపడతడు.
ఆయనకు బాధ కలుగుతది. కలిగితే అది రాజద్రోహమైతది.