ఎన్ని ప్రతిపాదనలు పంపినా స్పందించని కేంద్ర సర్కారు
ప్రోత్సాహకాలుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలే
కో-ఆపరేటివ్ ఫెడరలిజంపై విశ్వాసం ఉన్నదా?
మోదీకి నమ్మకం ఉంటే వివక్షకు తావు ఇవ్వొద్దు
రాష్ర్టాలు బలంగా ఉంటేనే దేశం బలోపేతమైతది
పాకిస్థాన్, బంగ్లాదేశ్తో భారతదేశానికి పోటీనా?
సబ్కా సాథ్.. సబ్కా వికాస్ చేతల్లో చూపాలి
రాష్ట్రంలో అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి
ఐటీలో 26%, వ్యవసాయంలో 119% వృద్ధి
వచ్చే దశాబ్దంలో తెలంగాణలో ఐదు విప్లవాలు
స్వరాష్ట్రంలో తలసరి ఆదాయం 128% వృద్ధి
వీధి వ్యాపారులకు ఇండస్ట్రీ బాడీతో చేయూత
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ వార్షిక నివేదిక
విడుదలలో మంత్రి కే తారకరామారావు
1987లో 470 బిలియన్ డాలర్ల ఎకానమీ సైజుతో భారత్, చైనా సమానంగా ఉండేవి. నేడు చైనా ఎకానమీ సైజు 16 ట్రిలియన్ డాలర్లతో అమెరికా తరువాత ద్వితీయ స్థానంలో ఉంటే, భారత్ ఎకానమీ మూడు ట్రిలియన్ డాలర్లే. జనాభా, ఆర్థిక పరంగా ఒకేవిధంగా ఉన్న రెండు దేశాల మధ్య 35 ఏండ్లలో ఎంత వ్యత్యాసం? రాజకీయాలు పక్కనపెట్టి అవసరమైనదానిపైనే దృష్టి పెడితే అభివృద్ధి సాధ్యం. -మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): ఫెడరల్ విధానంలో రాష్ర్టాలు బలోపేతమైతే దేశం బలోపేతమవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ప్రధాని మోదీ కో-ఆపరేటివ్ ఫెడరలిజం గురించి చెప్తూ ఉంటారని, నిజంగా ఆయనకు దానిపై విశ్వాసం ఉంటే వివక్షకు తావులేకుండా రాష్ర్టాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తిచేశారు. ప్రజాస్వామ్యంలో మంచిచేస్తే పొగడ్తలు ఎలా ఉంటాయో, తప్పుచేస్తే విమర్శలు కూడా తప్పవని స్పష్టంచేశారు. రాజకీయాలను ఎన్నికల వరకే పరిమితం చేయాలని, ఆ తరువాత ఆర్థికపరమైన అంశాలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. లేకపోతే అభివృద్ధి చెందిన దేశంగా మారాలన్న భారతదేశ కల ఎన్నటికీ సాకారం కాబోదని హెచ్చరించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ 2021-22 వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ సోమవారం హైదరాబాద్లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణకు పారిశ్రామిక కారిడార్లు మంజూరు చేయాలని కోరితే కేంద్రం ఇంతవరకు స్పందించలేదని చెప్పారు. హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-నాగపూర్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-మంచిర్యాల్, హైదరాబాద్-విజయవాడ తదితర ఇండస్ట్రియల్ కారిడార్లు మంజూరు చేయాలని కోరినట్టు గుర్తుచేశారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్కు కూడా ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వాల్సివున్నదని, కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ను ఏర్పాటుచేస్తే దానికి కేంద్రం ఒక్క పైసా సహాయం చేయకపోగా, దీనికి పోటీగా గుజరాత్కు నిధులు మంజూరుచేసి అక్కడ ఆర్బిట్రేషన్ సెంటర్ను ఏర్పాటుచేశారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్రం సబ్కా సాథ్, సబ్కా వికాస్ అన్నది కేవలం మాటలకు పరిమితం కాకుండా చేతల్లో చూపాలని, ఏ ఒక్క రాష్ర్టానికో కాకుండా అన్ని రాష్ర్టాలకూ సహకారం అందించాలని విజ్ఞప్తిచేశారు.
సమ్మిళిత అభివృద్ధే లక్ష్యం
వీధి వ్యాపారుల నుంచి బడా పారిశ్రామికవేత్త వరకు అందరూ బాగుండాలన్నదే తమ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఐటీ రంగం 26 శాతం వృద్ధిని నమోదు చేస్తే, వ్యవసాయరంగం 119 శాతం అభివృద్ధిని సాధించిందని తెలిపారు. అలాగే, సంక్షేమం, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి.. ఇలా ఏ రంగం చూసుకున్నా సమానంగా అభివృద్ధి సాధిస్తున్నాయని చెప్పారు. ఇదే అసలైన సమ్మిళిత అభివృద్ధికి ప్రతిరూపమన్నారు.
పాకిస్థాన్, బంగ్లాదేశ్లతోనా మనకు పోటీ?
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నదని, 1987లో 470 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో భారత్, చైనాలు సమానంగా ఉండేవని కేటీఆర్ తెలిపారు. నేడు చైనా ఆర్థికవ్యవస్థ 16 లక్షల కోట్ల డాలర్లతో అమెరికా తరువాత ద్వితీయ స్థానంలో ఉండగా, భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం మూడు లక్షల కోట్ల డాలర్లు మాత్రమేనని వివరించారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధిపైనే దృష్టి సారించడం వల్ల చైనా వరుసగా 25 సార్లు రెండంకెల జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. అమెరికా, ఐరోపాలోని అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడాలనే లక్ష్యంతో చైనా ముందుకు సాగుతుంటే, మనం మాత్రం పాకిస్థాన్, బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కన్నా మెరుగ్గా ఉన్నామని సంతృప్తి చెందుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. నేడు అమెరికాలో తలసరి ఆదాయం 60 వేల డాలర్లు కాగా, చైనాలో 9000 డాలర్లు ఉండగా, భారత్లో మాత్రం 1800 డాలర్లు మాత్రమేనని చెప్పారు.
అత్యుత్తమ పాలసీలతో ముందుకు
టీఎస్ ఐపాస్వంటి సులభతర అనుమతులు జారీచేసే విధానం భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా లేదని కేటీఆర్ చెప్పారు. గడచిన ఏడున్నరేండ్లలో రూ.2.32 లక్షల కోట్లకుపైగా టీఎస్ ఐపాస్ ద్వారా పెట్టుబడులు వచ్చాయని, 19 వేలకుపైగా దరఖాస్తులు పరిష్కారమయ్యాయని తెలిపారు. దాదాపు 16 లక్షల మందికి ఉపాధి లభించిందని అన్నారు.
వీధి వ్యాపారుల కోసం పారిశ్రామిక సంస్థ
వీధుల్లో వ్యాపారాలు చేసుకొనే చిరు వ్యాపారుల కోసం పశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఒక పారిశ్రామిక సంస్థను ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలు సైతం ఇటీవల టీ-ప్రైడ్ పథకంలో కొన్ని సవరణలు కోరగా, వెంటనే వాటిని ఆమోదించినట్లు చెప్పారు.
తలసరి ఆదాయంలో 128 శాతం వృద్ధి
2014లో రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు కాగా, ఇప్పుడు 128 శాతం వృద్ధితో రూ.2.78 లక్షలకు పెరిగిందని కేటీఆర్ తెలిపారు. జీఎస్డీపీ రూ.5.06 కోట్ల నుంచి 130 శాతం వృద్ధితో నేడు రూ.11.55 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. వ్యవసాయ, అనుబంధ రంగాలు 18.3 శాతం, పారిశ్రామికరంగం 20.4 శాతం, సేవల రంగం 18.3 శాతం వృద్ధిని నమోదు చేశాయని వివరించారు. తెలంగాణ దేశంలో భౌగోళికంగా 11వ, జనాభా పరంగా 12వ అతిపెద్ద రాష్ట్రమని, ఆర్థికపరంగా మాత్రం నాలుగో అతిపెద్ద రాష్టమని చెప్పారు. దేశంలో తెలంగాణ జనాభా 2.5 శాతం అయినప్పటికీ జీడీపీ కాంట్రిబ్యూషన్లో ఐదుశాతం ఉందని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త పారిశ్రామికవాడల ఏర్పాటు ద్వారా పెద్ద ఎత్తున మెగా ఇండస్ట్రీల నుంచి పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ వివరించారు.
వ్యాక్సిన్ క్యాపిటల్గా, ఫార్మా, బల్క్డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి సాధించిందన్నారు. ఈ ఏడాది కాలంలో అనేక జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడుల పెట్టేందుకు వచ్చాయని చెప్పారు. 2021-22లో 215 కన్నా అధిక పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని, వీటి విలువ రూ. 6400 కోట్లని వివరించారు. కార్యక్రమం అనంతరం పారిశ్రామికాభివృద్ధిలో ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచిన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించిన అధికారులను మంత్రి సత్కరించారు. టీఎస్ఐఐసీ, టీఎస్డీసీసీ చైర్మన్లు బాలమల్లు, లక్ష్మినారాయణలతోపాటు పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ వీసీ, ఎండీ వెంకటనర్సింహారెడ్డి, సీఈఓ మధుసూదన్, పరిశ్రమలశాఖ కమిషనర్ కృష్ణభాస్కర్, సీఐఐ, ఎఫ్ఐసీసీఐ, డీఐసీసీఐ, ఎఫ్టీసీసీఐ, టీఐఎఫ్ తదితర పరిశ్రమ సంఘాల ప్రతినిధులు కార్యక్రమానికి హాజరయ్యారు.
అగ్ర రాష్ర్టాల సరసన తెలంగాణ
అతికొద్ది కాలంలోనే ప్రగతిశీల రాష్ర్టాల సరసన తెలంగాణ కూడా చేరిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ర్టాలతో సమానంగా తెలంగాణను కూడా పరిగణించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఈ కృషిలో మూడున్నర లక్షల మంది ఉద్యోగుల కృషి ఉన్నదని అన్నారు. ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళితాభివృద్ధితో కూడిన త్రీ-ఐ మంత్ర (ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంక్లూసివ్ గ్రోథ్) రాష్ర్టాభివృద్ధికి దోహదం చేసిందని చెప్పారు.
దశాబ్దకాలంలో ఐదు రంగాల్లో విప్లవం
వచ్చే దశాబ్దకాలంలో తెలంగాణ వ్యవసాయం, ఆహారశుద్ధి రంగాల్లో ఐదు విభిన్న విప్లవాలు సాధించనున్నదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చేపల ఉత్పత్తికి సంబంధించి నీలి విప్లవం, పాల ఉత్పత్తిలో శ్వేత విప్లవం, మాంస ఉత్పత్తులలో గులాబీ విప్లవం, వంటనూనెల ఉత్పత్తికి సంబంధించి ఎల్లో రివల్యూషన్ సాధిస్తామని చెప్పారు. జీవశాస్ర్తాలు, ఏరోస్పేస్, ఐటీ, టెక్స్టైల్స్ తదితర రంగాలే కాకుండా ఈ రెండో దశలో గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన రంగాలపై దృష్టి సారిస్తామని చెప్పారు. తెలంగాణ ప్రపంచంలోనే నంబర్-1 ఫార్మా క్లస్టర్ను ఏర్పాటుచేసిందని తెలిపారు. దేశంలో అతిపెద్ద టెక్స్టైల్ పార్క్, అతిపెద్ద వైద్య పరికరాల పార్క్ను ఏర్పాటు చేసిందన్నారు.